contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కృష్ణపట్నం కరోనా ఆయుర్వేద మందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. నేటి నుంచి పంపిణీ

 

కృష్ణపట్నంలో శ్రీరామనవమి నుంచి ఆనందయ్య ఈ ఆయుర్వేద మందును పంపిణీ చేస్తున్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పటి వరకు వేలాది మంది ప్రజలు తీసుకున్నారు.

కృష్ణపట్నం.. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా ఈ గ్రామం హాట్ టాపిక్‌గా మారింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో ఉన్న కృష్ణపట్నంలో కరోనా నివారణకు ఆయుర్వేద మందు ఇస్తున్నారు. బొనిగి ఆనందయ్య ఉచితంగానే మందును పంపిణీ చేస్తున్నారు. ఐతే దీనికి మొదట బ్రేక్‌లు వేసిన ప్రభుత్వం.. తాజా మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆనందయ్య పంపిణీ చేస్తున్న కరోనా ఆయుర్వేద మందులో ఎలాంటి హానికారక పదార్థాలు లేవని ల్యాబ్లో తేలడంతో.. ఇవాళ్టి నుంచి మళ్లీ మందు పంపిణీ ప్రారంభం కానుంది. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి స్వయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆనందయ్య మందుకు ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనం క్యూకడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వమే అనుమతి ఇవ్వడంతో ఇంకా పెద్ద సంఖ్యలో జనం వచ్చే అవకాశముంది. ఈ క్రమంలోనే కృష్ణపట్నంలో ప్రత్యేక కౌంటర్లు, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. మందు కోసం వచ్చేవారు భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టారు. ఇక గ్రామానికి వెలుపల పోలీసు ఔట్‌పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. మందు పంపిణీ ఏర్పాట్లను తహశీల్దార్ సోమ్లా నాయక్, కృష్ణపట్నం సీఐ ఖాజావలి పరిశీలించారు. మందు కోసం వచ్చేవారు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. వారికి భోజన సౌకర్యం పెంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.గత వారం నెల్లూరు జిల్లా అధికారులు ఈ కరోనా ముందు నమూనాలను హైదరాబాద్‌లోని ఆయుష్‌ ప్రయోగశాలకు పంపించారు. అనంతరం ఆనందయ్య ఆయుర్వేద మందులో హానికారకాలు లేవని ప్రాథమికంగా నిర్ధారించారు. అందులో నల్ల జీలకర్ర, తోక మిరియాలు, పచ్చ కర్పూరం, పెద్ద పల్లేరు కాయ, నేల ఉసిరి, పిప్పిళ్ల చెక్క, పుప్పింట ఆకు, గుంట గరగర తేనె, పసుపు, జాజికాయ,మారేడు, నేరేడు, వేప ఇగురు, దేవర ఒంగి తదితర పదార్థాలు ఉన్నాయని.. ఇవి హానికారక పదార్థాలు లేవని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మందు పంపిణీకి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాగా, కృష్ణపట్నంలో శ్రీరామనవమి నుంచి ఆనందయ్య ఈ ఆయుర్వేద మందును పంపిణీ చేస్తున్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పటి వరకు వేలాది మంది ప్రజలు తీసుకున్నారు. కరోనా రాని వారికి ఒక ముందు, ఇప్పటికే పాజిటివ్ వచ్చిన వారికి మూడు రకాల మందును అందిస్తున్నారు. దాన్ని స్వీకరించిన వారిలో ఇప్పటి వరకు ఎలాంటి సమస్యా రాలేదు. పైగా కరోనా రోగులకు రిపోర్టుల్లో నెగెటివ్ వచ్చిందని చెబుతున్నారు. అంతేకాదు ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉన్న ఓ వ్యక్తి ఈ మందు తీసుకున్నాక కోలుకున్నారని అంటున్నారు. అందుకే కృష్ణపట్నం ఆయుర్వేద మందు కోసం జనం ఎగపడుతున్నారు. సీపీఐ నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి రాజకీయ నేతలు కూడా ఆ మందుకు మద్దతు తెలిపారు.
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :