contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

చాకచక్యంగా దొంగలను పట్టుకున్న ముంబయి పోలీసులు

ముంబయిలోని మలద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వృద్ధురాలి ఇంట్లో భారీ చోరీ జరిగింది. దొంగలు రూ.21 లక్షల విలువైన సొత్తును దోచుకున్నారు. 60 ఏళ్ల వృద్ధురాలు ఓ అపార్ట్ మెంట్లో నాలుగో ఫ్లోర్ లో నివాసం ఉంటోంది. పుట్టినరోజు సందర్భంగా స్నేహితురాలితో కలిసి మహాలక్ష్మి ఆలయం, ముంబాదేవి ఆలయాల సందర్శనకు వెళ్లింది. ఇదే అదనుగా తాళం వేసిన ఇంట్లోకి చొరబడిన దొంగలు అందినకాడికి ఎత్తుకెళ్లారు.

ఆమె ఇంటికి వచ్చి చూసే సరికి తలుపు విరగ్గొట్టి ఉంది. 32 అంగుళాల టీవీ, వజ్రాభరణాలు, ముత్యాల నగలు చోరీకి గురైనట్టు గుర్తించింది. దాంతో లబోదిబోమన్న ఆ వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న మలద్ పోలీసులు ఈ కేసును ఓ సవాలుగా తీసుకున్నారు. డీసీపీ విశాల్ ఠాకూర్, సీనియర్ ఇన్ స్పెక్టర్ ధనంజయ్ లిగాడే ఆధ్వర్యంలో దర్యాప్తు చేశారు.

సీసీటీవీ ఫుటేజి పరిశీలించగా, దొంగలు ఓ క్యాబ్ లో పరారైన విషయం వెల్లడైంది. ఆ క్యాబ్ నెంబరు స్పష్టంగా కనిపించకపోయినా, ఆ క్యాబ్ కాస్త విభిన్నమైన గుర్తులు కలిగి ఉంది. దీని ఆధారంగా పోలీసులు అనేకమంది ట్యాక్సీ డ్రైవర్లను ప్రశ్నించారు. చివరికి ఆ క్యాబ్ ఘట్కోపర్ ప్రాంతానికి చెందినదిగా గుర్తించారు. ఆ క్యాబ్ సొంతదారు కుమారుడు నౌషాద్ ఖాన్ పై కొన్నిరోజులు నిఘా ఉంచిన పోలీసులు… వృద్ధురాలి ఇంట్లో దోపిడీకి పాల్పడింది అతడికి సంబంధించిన ముఠానే అని నిర్ధారించుకున్నారు. ఆపై అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు.

అయితే, నౌషాద్ ఖాన్ సహచరులు మాత్రం అంత తేలిగ్గా పట్టుబడలేదు. వారందరికీ భారీ నేరచరిత్ర ఉండడంతో, పోలీసుల దర్యాప్తు తీరుతెన్నులు బాగానే తెలుసు కాబట్టి, కొన్నిరోజుల పాటు తప్పించుకుని తిరిగారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు కొత్త రూట్లో వెళ్లాల్సి వచ్చింది. నౌషాద్ ఫోన్ ద్వారా వారికి కాల్స్ చేయించి, పక్కాగా వలపన్ని అందరినీ పట్టుకున్నారు. సద్దాం ఖాన్, అబ్దుల్ పఠాన్, రోనీ ఫెర్నాండెజ్ లను విడివిడిగా పట్టుకున్నారు.

వీరిలో సద్దాం ఖాన్ పై ముంబయి, థానే, నవీ ముంబయి ప్రాంతాల్లో 33 కేసులు ఉండడం గమనార్హం. అతడు పక్షం రోజుల కిందటే బెయిల్ పై బయటికి వచ్చాడు. ఇక, అతడ్ని పట్టుకోవడానికి మలద్ పోలీసులు ఏంచేశాంటే… ఓ బార్లో కలుసుకుందాం రమ్మంటూ నౌషాద్ ద్వారా కబురు పంపించారు. సద్దాం వచ్చే సమయానికి బార్లో వెయిటర్లుగా పలువురు పోలీసులు మారువేషాల్లో కాపుకాశారు. ఈ విషయం తెలియని సద్దాం ఉంతో హుషారుగా బార్లోకి వచ్చి పోలీసులకు దొరికిపోయాడు.

ఇక, మరో దొంగ ఫెర్నాండెజ్ ను సైతం పోలీసుల మారువేషాల సాయంతో పట్టుకున్నారు. ఫలానా చోటికి రావాలంటూ నౌషాద్ చేత ఫెర్నాండెజ్ కు ఫోన్ చేయించారు. వారు కలుసుకోవాల్సిన ప్రదేశానికి ఫెర్నాండెజ్ ఓ ఆటోలో రాగా, ఆ ఆటోడ్రైవర్ కూడా మారువేషంలో ఉన్న పోలీసే కావడం విశేషం.

మరో దొంగ పఠాన్ ను పట్టుకునేందుకు ఇద్దరు పోలీసులు ప్రేమికుల అవతారం ఎత్తారు. ఇతర పోలీసులు వీధుల్లో వ్యాపారాలు చేసుకునేవారిగా వేషాలు ధరించారు. అతడికి ఏమాత్రం అనుమానం రాని విధంగా తమ పాత్రల్లో జీవించారు. ఆ విధంగా అందరు దొంగలను పట్టుకున్నారు. చోరీకి గురైన టీవీతో పాటు వజ్రాభరణాలు, ముత్యాల నగలను స్వాధీనం చేసుకున్నారు.

నౌషాద్ గ్యాంగ్ నుంచి వజ్రాల నగలను కొనుగోలు చేసిన ఘట్కోపర్ కు చెందిన గుడ్డు సోని అనే నేరస్థుడ్ని కూడా మలద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై గతంలో రైల్వే పోలీసులు 39 కేసులు నమోదు చేసిన విషయం వెల్లడైంది. వీరందరికీ జైల్లోనే పరిచయం అయిందని, బయటికొచ్చాక ఇలా ముఠాగా ఏర్పడి నేరాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :