contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఆర్ నారాయణ మూర్తి ‘రైతన్న’ విడుదలకు రెడీ

పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన చిత్రం ‘రైతన్న’. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా రైతు నాయకుల కోసం ప్రత్యేకంగా ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. షో అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రి శ్వరారావు, కాంగ్రెస్ పార్టీ లీడర్ కోదండ రెడ్డి, సీపిఐ నాయకులు చాడా వెంకట్ రెడ్డి, సిపీఎం నాయకులు మధు, టిఆర్ఎస్ నాయకులు శ్రీనివాసరెడ్డి, ప్రజాకవి గద్దర్, ఎం ఎల్ సి గోరటి వెంకన్న, కవి అందే శ్రీ, రైతు నాయకులు వెంకట రామయ్య, మల్లారెడ్డి , గోవర్ధన్ , రైతు సంఘం సాగర్, శ్రీమతి పద్మ తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ.. ”సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాము. ఈ సినిమాలో ఎస్పీ బాలసుబ్రమణ్యంగారు, వంగపండు ప్రసాదరావుగారు పాటలు పాడారు. వారికి నా నివాళులు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఈ చిత్రం తీశాను. నేటి రైతు పరిస్థితి గురించి ఈ చిత్రం ద్వారా చెప్పడం జరిగింది. భారతదేశంలో సామాజికంగా వెనకబడిన కులం ఏదైనా ఉంది అంటే అది రైతు కుటుంబమే. రైతు పరిస్థితి ఏమిటి?. రైతే దేశానికి వెన్నెముక. రైతే రాజు… ఆ నానుడి ఏమైంది? ఆ రైతు ఎక్కడున్నాడు? అన్నం పెట్టే అన్నదాత ఈరోజు ఏ పొజిషన్‌లో ఉన్నాడు? చాలా బాధాకరంగా నేటి రైతు పరిస్థితి చూస్తుంటే. ఎందుకంటే రైతు తను పండించే పంటకి మార్కెట్లో గిట్టు బాటు ధర రాక తన అప్పులు తీర్చుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నాడు. చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కొస్తున్నాడు. అలా రాకూడదు.. రైతు ఆత్మహత్య చేసుకోకూడదు. అన్నం పెట్టే రైతుకి గిట్టుబాటు ధర కావాలి. డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్స్‌లను ఇంప్లిమెంట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం వాటికి చట్టబద్దత కలిపించిన నాడు రైతే రాజు. రైతే దేశానికి వెన్నెముక. అప్పుడు రైతు వృద్ధిలోకి వస్తాడు. వ్యవసాయం దండుగ కాదు పండుగనే రోజు రావాలని అన్నం పెట్టే అన్నదాత సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను తీసిన చిత్రమే ఈ రైతన్న” అని అన్నారు.

మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రిశ్వరరావు మాట్లాడుతూ.. ”ఈ రోజు రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు, వారి బాధలు.. అలాగే ఇప్పుడు మోడీ గవర్నమెంట్ తెచ్చిన రైతు చట్టాలు రైతులకు ఎలాంటి కష్టాలు తెస్తాయో కళ్ళకు కట్టినట్లు చూపించారు ఈ రైతన్ను సినిమాలో ఆర్ నారాయణ మూర్తిగారు. ఆయన చెప్పినట్లు స్వామినాథన్ కమిషన్ నివేదికను అమలు పరచాలి. కేరళ ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ చట్టలను అమలు పరుస్తోంది.. మోడీ ప్రభుత్వం రాజ్యంగ ప్రకారం బిల్లును తీసుకురాలేదు. ఈ బిల్లుపై విచారణ జరగాలి. విద్యుత్ బిల్లు అదానీ ఆఫీస్‌లో తయారైంది. భారత రైతాంగం ఏడు నెలల నుంచి ఈ వ్యవసాయ విద్యుత్ చట్టాలపై పోరాడుతుంది. ఎంతో ధైర్యం చేసి ఈ సినిమాను నారాయణ మూర్తి తీసినందుకు ఆయనకు ధన్యవాదములు చెపుతున్నాను..” అని తెలుపగా.. ”అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టే కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తున్న మోడీ ప్రభుత్వం ఇప్పుడు రైతులను దగా చేసే చట్టాలను తీసుకొచ్చింది. అన్ని లోతుగా విచారణ చేసి సరైన టైమ్‌లో ప్రజల ముందుకు తీసుకు వస్తున్న ఆర్ నారాయణ మూర్తికి అభినందనలు..” అన్నారు చాడా వెంకట రెడ్డి.

కాంగ్రెస్ లీడర్ కోదండ రెడ్డి మాట్లాడుతూ.. ”రెండుగంటల ఈ రైతన్న సినిమాలో మంచి సందేశం ఇచ్చారు. చాలా మంది డబ్బుల కోసం తీస్తారు కానీ ఆర్ నారాయణ మూర్తి రైతుల కోసం సినిమా తీశారు. భారతదేశంలో రైతులలో ఐకమత్యం లేదు అని ఎన్ జీ రంగా గారు అనేవారు. ఈ సినిమా లాస్ట్‌లో రైతులందరినీ కలిపి చూపించినందుకు సంతోష పడ్డాను. ఇప్పటికైనా ఆ చట్టాలను రద్దు చేసి రైతులను కాపాడండి అని ధైర్యంగా సినిమాలో చూపించిన ఆర్ నారాయణ మూర్తికి ధన్య వాదాలు” అని తెలుపగా ”కేంద్ర ప్రభుత్వం చేసిన రైతు చట్టాలను బ్యాన్ చేయాలని గత ఏడు నెలల నుంచి రైతులు పోరాటం చేస్తుంటే కేంద్రానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. దోపిడి దారులకే మోడీ ప్రభుత్వం సహకరిస్తుంది. ఈ సినిమా చూసి నా కళ్ళు చెమర్చాయి. ప్రజలు ఈ సినిమాని మెచ్చుకుంటారు..” అని అన్నారు టిఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి.

ప్రజా వాగ్గేయ కారుడు ఎం ఎల్ సి గోరటి వెంకన్న మాట్లాడుతూ.. ”ఆర్ నారాయణ మూర్తి ప్రతి పాత్ర కన్నీళ్లు తెప్పించే విధంగా ఉంటుంది. చట్టాలు, రైతాంగ వ్యవస్థను సినిమాగా తీశారు. ఈ సినిమా బోర్ కొట్టదు. బాగుంది. చాలా మందికి ఆయన గురించి తెలీదు. ఈ సినిమాకి సబ్సిడీలు ఇవ్వాలి అన్నారు కానీ ఆయనకు భూమి ఇస్తాను అంటేనే తీసుకోలేదు అలాంటి నిస్వార్థ పరుడు ఆర్ నారాయణ మూర్తి. వాజ్‌పేయి గారి లాంటి వారు చెపితే వినేవాళ్ళు. కానీ ఇప్పుడున్న నాయకులు చాలా కఠినత్వంగా ఉన్నారు. కొన్ని రాష్ట్రాలు రైతులకోసం పనిచేస్తున్నాయి. ఇక్కడ(తెలంగాణ) రైతుబంధు బాగుందని అందరూ అన్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి” అని అన్నారు.

ప్రజాకవి గద్దర్ మాట్లాడుతూ.. ”తత్వవేత్తలు ప్రపంచం గురించి భాష్యం చెప్పారు. వాటిని నేను తప్పు పట్టను. ఈ రైతన్న సినిమాని పౌర సమాజంలోకి తీసుకొని వెళ్ళాలి. సొంత ఆశ లేని వాడు ఆర్ నారాయణ మూర్తి. ఇల్లు లేదు, భార్య లేదు. ఆలూ లేదు చూలూ లేదు.. తను నమ్మిన సిద్ధాంతం కోసం రక్తాన్ని చిందించే వ్యక్తి ఆర్ నారాయణ మూర్తి. ఈ సినిమా కార్పొరేట్ రంగాలకు క్వశ్చన్‌ పేపర్ వంటిది. ఈ సినిమాలో రైతుల బాధల గురించి క్లియర్‌గా చెప్పాడు. కమిట్‌మెంట్ ఉన్న వ్యక్తి ఆర్. నారాయణ మూర్తి. వ్యవసాయం దండుగ కాదు వ్యవసాయం పండుగ. ఆ పండుగలో పాల్గొంటాము అని చెపుతున్నాను. గౌరవ ప్రధాని గారు మీరు తెచ్చిన వ్యవసాయ విద్యుత్ చట్టాలు రద్దు చేయండి. అందరికీ అప్పీల్ చేస్తున్న పెద్దవాళ్ళు అందరూ ఆలోచన చేయండి అని చెపుతున్నాను. రైతాంగం తప్పకుండా గెలుస్తుంది” అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :