వైసిపి అధికారంలోకి వచ్చాక ఎపిలో గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థలు ఏర్పాటైన సంగతి తెలిసిందే. అయితే, గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల అధికారాలను కొన్నింటిని విఆర్ఓలకు బదలాయిస్తూ మార్చి 25న ఎపి ప్రభుత్వం జారీ చేసిన జిఒ నెంబర్ 2ను హైకోర్టు సస్పెండ్ చేసింది. గుంటూరు జిల్లా తోకలవానిపాలెం సర్పంచ్ కృష్ణమోహన్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు నేడు విచారణ జరిపింది. పంచాయతీ కార్యదర్శుల హక్కులను హరించేలా జిఒ నెంబర్ 2 ఉందని పిటిషనర్ తరుఫు న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 73 సవరణకు, ఎపి పంచాయతీ రాజ్ చట్టానికి వ్యతిరేకంగా జిఒ ఉందని కోర్టుకు తెలిపారు. సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు విఆర్ఒ వ్యవస్థను ఏర్పాటు చేశామని ప్రభుత్వ తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు వినన ధర్మాసనం స్పందిస్తూ.. ”దీనిపై గతంలోనూ ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. గ్రామ పంచాయతీ కార్యాలయాలు, సర్పంచుల వ్యవస్థ ఉండగా..
సమాంతరంగా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించింది. సంక్షేమ పథకాలను పంచాయతీల ద్వారా ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్లకూడదని అడిగింది. రాష్ట్రానికి సిఎం ఎలాగో.. పంచాయతీలకు సర్పంచ్ కూడా అలాగేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. అనంతరం ప్రభుత్వం జారీ చేసిన జిఒ నెంబర్ 2ను సస్పెండ్ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు తీర్పుపై ఎపి పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోషియేషన్ గౌరవ చైర్మన్ బుచ్చిరాజు హర్షం వ్యక్తం చేశారు.