చర్చల ద్వారా శాంతి స్థాపనకు కట్టుబడి ఉన్నామంటూనే చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. ఇటీవలే తూర్పు లడఖ్ సరిహద్దు వద్ద చైనా తమ బలగాలను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. గాల్వన్లోయ వద్ద ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల ఘటనలు మరవకముందే అరుణాచల్ ప్రదేశ్ మెక్మోహన్ రేఖ వెంబడి చైనా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. ఆ ప్రాంతం వద్ద సుమారు 40 వేల మంది సైనికులను చైనా మోహరించిందని సమాచారం. మెక్మోహన్ రేఖ దిశగా చైనా సైన్యం కదలికలతో భారత్ అప్రమత్తమైంది. బలగాల ఉపసంహరణపై చైనా మరోసారి మాట తప్పడంతో డ్రాగన్ దేశం దుందుడుకు చర్యలకు పాల్పడితే దీటుగా బదులిచ్చేందుకు సిద్ధంగా ఉండేందుకు భారత్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుటోంది. గగనతల రక్షణ వ్యవస్థలు, దీర్ఘశ్రేణి పోరాట సామగ్రితో పాటు అరుణాచల్ ప్రదేశ్కు బలగాలు, ఇతర యుద్ధ సామగ్రిని తరలిస్తోంది. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి రిజర్వ్ బలగాలను సమీకరిస్తోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో భారత వైమానిక దళం సర్వసన్నద్ధంగా ఉండాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదేశాలు ఇచ్చారు. చైనా సైనికుల కదలికలను భారత్ నిశితంగా గమనిస్తోంది. భారత్తో ఇటీవల జరిగిన ఒప్పందానికి కట్టుబడకపోవడమే కాకుండా చైనా సైన్యం మరింత ఉద్రిక్తతలు చెలరేగేలా తన చర్యలను కొనసాగిస్తోందని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు, ఫింగర్-5 ప్రాంతం నుంచి కూడా చైనా సైన్యం వెళ్లేందుకు ససేమిరా అంటోందని తెలిసింది. హాట్స్ప్రింగ్, గోగ్రాపోస్ట్ ప్రాంతాల్లో భారీ నిర్మాణాలను కొనసాగిస్తోంది. చైనా చర్యలకు దీటుగా భారత్ కూడా సరిహద్దు ప్రాంతాల్లో నిర్మాణాలు కొనసాగిస్తోంది.
![](https://www.thereportertv.com/wp-content/uploads/2024/07/ఎమ్మిగనూరు-లో-కార్గిల్-విజయ్-దివస్-వేడుకలు-.webp)