హైదరాబాద్ : పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థానీయుల వీసాలు రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో హైదరాబాద్లో పాకిస్థానీయుల వివరాలపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. స్పెషల్ బ్రాంచ్లో 208 మంది పాకిస్థానీయుల పేర్లు రిజిస్టర్ అయ్యాయి.
వీరిలో లాంగ్ టర్మ్ వీసా ఉన్నవాళ్లు 156 మంది, షార్ట్ టర్మ్ వీసా ఉన్నవాళ్లు 13 మంది, బిజినెస్ వీసాలతో ఉంటున్నవారు 39 మంది. కేంద్ర సర్కారు ఆదేశాల మేరకు వారంతా దేశం విడిచి వెళ్లి పోవాల్సి ఉంది. దీంతో స్పెషల్ బ్రాంచ్ అధికారులు అప్రమత్తమయ్యారు.
పాకిస్థాన్ ముర్దామాద్ నినాదాలు
మరోవైపు, పాకిస్థాన్ ముర్దామాద్ నినాదాలు, పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో ఇవాళ ముస్లింలు పాకిస్థాన్ ముర్దామాద్ నినాదాలు చేశారు. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా ముస్లింలు వేలాది సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. ఇవాళ శుక్రవారం కావడంతో.. ఎంఐఎం చీఫ్ అసరుద్దీన్ ఒవైసీ పిలుపుమేరకు నల్ల రిబ్బన్లను ధరించి ముస్లింలు నమాజ్ చేశారు.
కాగా, పహల్గాం దాడికి ప్రతిస్పందనగా భారత్ ఉగ్రవాదాన్ని సమూలంగా అంతమొందించాలనే సంకల్పంతో ముందుకు వెళుతోంది. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ తక్షణమే దౌత్యపరమైన ఒత్తిడిని పెంచడమే కాకుండా, భవిష్యత్తులో పాకిస్థాన్ ఆర్థికంగా కోలుకోలేకుండా సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది.
అయినప్పటికీ, పహల్గాం ఘటనకు సంబంధించి నేరుగా ప్రమేయం ఉన్న ఉగ్రవాదులను శిక్షించాల్సిందేనని దేశవ్యాప్తంగా ప్రజల నుంచి గట్టిగా డిమాండ్ వస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్పై నేరుగా ఎలా ప్రతీకారం తీర్చుకోవచ్చన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సైనిక చర్య విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్లో ఉంటున్న పాకిస్థానీయులను వెనక్కి పంపించాలని కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకుంది.
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులపై ఇప్పటికే భద్రతా దళాలు సోదాలను తీవ్రతరం చేశాయి. తాజాగా లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని సైన్యం హతమార్చింది. పహల్గాం దాడిలో పాలుపంచుకున్న ఉగ్రవాదులను పట్టుకోవాలనే లక్ష్యంతో గాలింపు నిర్వహిస్తున్న భద్రతా దళాలకు బందిపొరా ప్రాంతంలో అల్తాఫ్ సమాచారం లభించింది.
దాంతో శుక్రవారం ఉదయం ఆర్మీ, పోలీసు సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించాయి. ఉగ్రవాదులు కనిపించడంతో ఎదురుకాల్పులు మొదలయ్యాయి. చివరికి అల్తాఫ్ను మట్టుబెట్టడంలో భద్రతా బలగాలు విజయవంతమయ్యాయి. ఇదంతా ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కశ్మీర్ పర్యటన సందర్భంగా జరగడం విశేషం.
పాకిస్థాన్ పౌరులను తమ దేశానికి తిరిగి వెళ్లాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో పంజాబ్లోని అటారీ-వాఘా సరిహద్దు ద్వారా పాక్ పౌరులు అనేక మంది తమ స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. సార్క్ వీసా పథకం కింద పర్యటనకు వచ్చిన వారు కేంద్ర ఆదేశాల మేరకు వెనుదిరిగారు. ఈ సందర్భంగా కరాచీకి చెందిన ఓ కుటుంబం మాట్లాడుతూ.. తాము 45 రోజుల వీసాతో బంధువులను కలవడానికి భారత్కు వచ్చామని, పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది.