contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఢిల్లీలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు

దిల్లీ లో 100కు పైగా పాఠశాలలకు ఏకకాలంలో బాంబు బెదిరింపులు రావడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ-మెయిల్ ద్వారా వచ్చిన ఈ హెచ్చరికలతో అప్రమత్తమైన అధికారులు వెంటనే పాఠశాలలను ఖాళీ చేయించి, విస్తృత తనిఖీలు చేపట్టారు. చివరకు ఇవన్నీ ఉత్తి బెదిరింపులేనని తేలడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

వివరాల్లోకి వెళితే, శనివారం ఉదయం 6:10 గంటల సమయంలో ‘టెర్రరైజర్స్111’ అనే గ్రూపు నుంచి పలు పాఠశాలలకు ఈ-మెయిల్స్ అందాయి. ‘మీ భవనంలో బాంబులు పెట్టాం.. స్పందించకపోతే విపత్తు తప్పదు’ అనే సబ్జెక్ట్‌తో ఈ మెయిల్స్ పంపారు. గతంలోనూ ఇదే గ్రూపు నుంచి ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి.

ఈ సమాచారం అందిన వెంటనే దిల్లీ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, బాంబు నిర్వీర్య దళాలు రంగంలోకి దిగాయి. ద్వారకలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్), కృష్ణా మోడల్ పబ్లిక్ స్కూల్, సీఆర్‌పీఎఫ్ పబ్లిక్ స్కూల్, నజఫ్‌గఢ్‌లోని మాతా విద్యా దేవి పబ్లిక్ స్కూల్‌తో పాటు అనేక పాఠశాలలకు బృందాలు చేరుకున్నాయి. ముందుజాగ్రత్త చర్యగా విద్యార్థులను, సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

పాఠశాల ప్రాంగణాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. “మేము స్కూళ్లలో పూర్తిస్థాయిలో సోదాలు నిర్వహించాం. ఎలాంటి ప్రమాదకర వస్తువులు దొరకలేదు” అని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురై పాఠశాలల వద్దకు చేరుకోవడంతో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకే ఈ బెదిరింపులకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ-మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై దర్యాప్తు ప్రారంభించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :