దుప్పులవాడ, అల్లూరి జిల్లా: అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం దుప్పులవాడ గ్రామంలో గిరిజనులు సామూహికంగా మావోయిస్టులకు వ్యతిరేకంగా ఒక శాంతి స్థూపాన్ని నిర్మించారు. “మావోయిస్టులు వద్దు – గిరిజనుల అభివృద్ధి ముద్దు” అనే నినాదంతో ఈ శాంతి స్తూపాన్ని స్థాపించారు.
ఈ కార్యక్రమంలో పలువురు గిరిజనులు పాల్గొన్నారు. వారు మావోయిస్టుల ఉనికి వల్ల తమ గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టులు ‘ఇన్ఫార్మర్’ అనేది నెపంగా అమాయక గిరిజనుల ప్రాణాలను హరించటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.
శాంతి స్థూపం నిర్మాణం సందర్భంగా మాట్లాడిన గ్రామస్తులు, “ఇప్పటికైనా మావోయిస్టులు హింసా మార్గాన్ని విడిచి జనజీవన స్రవంతిలో కలవాలి. గిరిజన ప్రాంత అభివృద్ధికి సహకరించాలని” కోరారు. అలాగే, “ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం లేకుండా శాంతి పరిరక్షణకు ప్రతీకగా ఈ స్థూపం నిలవాలి” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కొమ్ములవాడ, బంధవీధి, గొర్రిలోవ, దుప్పలవాడ, రస్యగూడ, కొత్తపాకల, చల్లని శిల్ప వంటి గ్రామాల గిరిజనులు పాల్గొన్నారు. ఇది గిరిజన సమాజంలో మావోయిస్టులపై పెరిగిన విరక్తిని ప్రతిబింబిస్తోందని స్థానికులు అభిప్రాయపడ్డారు.