అమరావతి: ఐఐటీ మద్రాస్, ఐబీఎం రీసెర్చ్ సంయుక్తంగా ఎన్పీటీఈఎల్ (NPTEL) వేదికపై అందిస్తున్న ‘అడ్వాన్స్డ్ క్వాంటం స్కిల్లింగ్’ కోర్సుకు ఆంధ్రప్రదేశ్ నుంచి విశేష స్పందన లభించడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ కోర్సులో ఇప్పటికే రాష్ట్రం నుంచి 50,000 మందికి పైగా విద్యార్థులు నమోదు కావడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, క్వాంటం టెక్నాలజీ రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలతో లక్ష మంది నిపుణులను తయారు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి ఈ స్పందన మరింత బలాన్ని ఇస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను క్వాంటం రంగంలో పరిశోధన, ఆవిష్కరణలు, దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా నిలబెడతామని ఆయన స్పష్టం చేశారు.
భవిష్యత్తు క్వాంటం టెక్నాలజీదేనని పేర్కొన్న చంద్రబాబు, ఈ కోర్సులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించిన విద్యార్థులను తానే వ్యక్తిగతంగా సత్కరిస్తానని ప్రకటించారు. క్వాంటం రంగంలో భవిష్యత్ ప్రపంచ నాయకులుగా ఎదిగే యువతకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఉన్నత సాంకేతిక నైపుణ్యాలతో యువతను తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం పేర్కొంటూ, క్వాంటం టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించబోతుందని ధీమా వ్యక్తం చేశారు.










