అనంతపురం జిల్లా, గుంతకల్లు మండలం: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంతకల్లు నియోజకవర్గ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం మరియు తెలంగాణ రాష్ట్రం నారాయణపేట నియోజకవర్గం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకి రాజేంద్ర రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దేవాలయం పునర్నిర్మాణంలో భాగంగా విమానగోపురం, అర్థమండపం, మహామండపాల నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ గుంతకల్లు నియోజకవర్గంలో ఆంజనేయ స్వామి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉండటం ప్రజలు చేసుకున్న పుణ్యమని అన్నారు. ఇలాంటి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. రాబోయే రోజుల్లో దేవాలయం అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని, సంబంధిత అధికారులతో మాట్లాడి ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.
అనంతరం ఉగాది పండుగ సందర్భంగా నిర్వహించనున్న స్వామివారి ఉత్సవాలకు సంబంధించిన గోడపత్రికలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గుంతకల్లు టీడీపీ ఇన్చార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి, ఎమ్మెల్యే సోదరుడు గుమ్మనూరు శ్రీనివాసులు, బీజేపీ నాయకురాలు వనగొంది లక్ష్మి, మండల నాయకులు, కార్యకర్తలు, ఆలయ అనుబంధ కమిటీ సభ్యులు మరియు భక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.








