అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గంలో పేదరిక నిర్మూలన దిశగా కీలక చర్యలు కొనసాగుతున్నాయి. గుంతకల్ పట్టణంలోని శంకరానంద డిగ్రీ కాలేజీలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పి-ఫోర్ (P4) కార్యక్రమం సందర్భంగా ఆర్డీవో శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ఒకపూట భోజనం కూడా కష్టంగా ఉన్న 7,591 పేద కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. వీరిలో ఇప్పటికే 2,368 కుటుంబాలను 470 మంది మార్గదర్శకులు దత్తత తీసుకుని సహాయం అందిస్తున్నారని పేర్కొంటూ, వారి సేవలను అభినందించారు.
మిగిలిన 5,223 కుటుంబాలను కూడా దత్తత తీసుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తన వంతు బాధ్యతగా 50 శాతం ప్రజలకు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. 2047 నాటికి పేదరిక నిర్మూలన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
పి-ఫోర్ కార్యక్రమం ద్వారా ప్రతి వ్యక్తికి కనీస జీవన ప్రమాణాలు కల్పించడం, ఆకలి, నిరుద్యోగం, నిరాశ్రయత్వం వంటి సమస్యలను పూర్తిగా తొలగించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ప్రభుత్వం, ప్రైవేట్ రంగం, ప్రజల భాగస్వామ్యంతోనే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సమాజ సేవలో ముందుండి సేవలు అందిస్తున్న ఉత్తమ మార్గదర్శకులను సత్కరించారు. సత్కారం పొందిన వారిలో గుమ్మనూరు నారాయణస్వామి (గుంతకల్ మండలం ఇంచార్జ్), గుమ్మనూరు ఈశ్వర్ (గుత్తి, పామిడి మండలాల ఇంచార్జ్), శివ ప్రసాద్ (అన్నపూర్ణ హోటల్, గుత్తి), మఖం శ్రీకాంత్ (గుత్తి), ఎంకే చౌదరి (టీడీపీ పట్టణ అధ్యక్షులు, గుత్తి), కె శ్రీనివాసులు (ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు, గుత్తి), రాజగోపాల్ (సాయి హాస్పిటల్, గుత్తి), పత్తి హిమబిందు (సాయి కృష్ణ హాస్పిటల్, గుంతకల్) ఉన్నారు.
పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పునరుద్ఘాటించారు.








