విజయనగరం, బొబ్బిలి :: బొబ్బిలి కోటలోని చారిత్రక దర్బార్ మహల్లో ఎమ్మెల్యే రంగారావు (బేబీ నాయన) జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. బొబ్బిలి పట్టణం టీడీపీ అధ్యక్షులు గెంబలి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా రక్తదానం చేశారు. మొత్తం 210 యూనిట్ల విలువైన రక్తాన్ని దానం చేయడం విశేషం. రక్తదాతలందరికీ ఎమ్మెల్యే స్వయంగా ప్రశంసాపత్రాలు అందజేసి వారిని అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలు రక్షించగలుగుతున్న మీరు నిజమైన నాయకులు” అని కొనియాడారు. అలాగే, ఇప్పటి వరకు 90 సార్లు రక్తదానం చేసిన మింది విజయమోహన్ ని ప్రత్యేకంగా సత్కరించి, ఆయన సేవలను ప్రశంసించారు.
ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు ప్రేరణనిచ్చే విధంగా నిర్వహించాలనీ, రక్తదానం వంటి శ్రేయోభిలాషి కార్యక్రమాల్లో యువత ముందుండాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.