ఏపీలో సీబీఐ నో ఎంట్రీ అని బోర్డు పెట్టనున్నారా? అత్యున్నత దర్యాప్తు సంస్థపై నిషేధాన్ని అమలు చేయనున్నారా? పశ్చిమబెంగాల్ తరహాలో నిర్ణయం తీసుకోనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
ఇటీవల సీబీఐ తీరుపై వైసీపీ పెద్దలు, సలహాదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ అధికారుల వ్యవహార శైలిపైనా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీ సర్కారు కీలక నిర్ణయం ఒకటి తీసుకున్నట్టు ప్రచారం సాగుతోంది. ఏపీలో సీబీఐ ఎంట్రీ లేకుండా చూడాలని భావిస్తున్నట్టు టాక్ నడుస్తోంది.
అదే జరిగితే నాటి చంద్రబాబు నిర్ణయం సరైనదేనని జగన్ ఒప్పుకున్నట్టవుతుంది.
సీబీఐ దూకుడు..
ప్రస్తుతం వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తోంది. అరెస్టులతో కాక పుట్టిస్తోంది. జగన్ ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసినా ఫలితం లేకపోయింది.
ఈ నేపథ్యంలో సీబీఐ విషయంలో కఠినంగా ముందుకెళ్లాల్సిన పరిస్థితి జగన్ సర్కారుకు ఎదురైంది.
సీబీఐ పనితీరు మీద ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ డీజీపీ తోనూ పార్టీ ముఖ్య నేతలతోనూ చర్చించారు అని వార్తలు వస్తున్నాయి..
సీబీఐని ఏపీలో ఎంట్రీ ఇస్తే అనేక రకాలుగా ఇబ్బందులే అన్నట్లుగా వైసీపీ పెద్దలు సైతం భావిస్తున్నారు. దేశ వ్యాప్తంగా సీబీఐ తీరుపై చర్చ జరుగుతోంది.
యాక్టివ్ గా ఉండే విపక్ష నేతలనే సీబీఐ టార్గెట్ చేస్తుంది. ఒకవేళ రానున్న రోజుల్లో కేంద్రంతో సఖ్యత చెడితే ఏపీ లో సంచలనాలకు సీబీఐ రెడీ అయినా ఆశ్చర్యం లేదని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
గత ఎన్నికల ముందు సేమ్ సీన్..
గత ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇదే పనిచేశారు. సీబీఐ దూకుడును తగ్గించే ప్రయత్నం చేశారు. ప్రధాని మోదీకి సవాల్ చేశారు.
ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా సీబీఐ ఎంట్రీ ఇవ్వకూడదని నిర్ణయించారు. నాడు విపక్షంలో ఉన్న జగన్ దానిని తప్పుపట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ నిర్ణయాన్ని, ఉత్తర్వులను పక్కన పడేశారు.
అయితే ఇన్నాళ్ల పాటు తన సిఫారసులకు కొంత ఆమోదం రావడంతో జగన్ సీబీఐ గురించి పట్టించుకోవడం మానేశారు.
అయితే ఇప్పుడు కేంద్రం ఆదేశాలతో సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తుండడంతో పునరాలోచనలో పడ్డారు.
అందుకే సీబీఐని ఏపీలో అడుగు పెట్టకుండా ఉత్తర్వులు జారీ చేయడానికి ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
కొద్దిరోజుల్లో స్పష్టత
నాడు చంద్రబాబు ఏ కారణాలతో సీబీఐని వద్దు అన్నారో ఇపుడు జగన్ కూడా అదే తీరున ప్రయాణిస్తారా అన్నదే పాయింట్.
అయితే ప్రస్తుతం వివేకా హత్య కేసు విచారణ సాగుతోంది. అందువల్ల ఈ దశలో కాకుండా సరైన సమయం చూసుకుని మరీ సీబీఐకి ఏపీలో నో ఎంట్రీ బోర్డుని పెట్టడానికి వైసీపీ తీవ్రంగానే ఆలోచిస్తోంది అని అంటున్నరు.
కేంద్ర పెద్దల ఆధీనంలో ఉన్న సీబీఐకి ఏపీలో నో అంటే మోడీ సర్కార్ కే డైరెక్ట్ గా షాక్ ఇచ్చినట్లుగా కూడా ఉంటుంది.
ప్రస్తుతానికి కేంద్రంతో దూరం పెరిగింది. అది ఎంత అన్నదే వైసీపీకి కూడా అంతు చిక్కడంలేదు.
దాని మీద ఒక స్పష్టత వచ్చాక మాత్రం కచ్చితంగా సీబీఐ మీద డెసిషన్ ఉంటుందనే ప్రచారం ఊపందుకుంటోంది….