హైదరాబాద్ : ప్రముఖ తెలుగు వార్తా ఛానల్ మహా టీవీ కార్యాలయంపై జరిగిన దాడిని రాష్ట్రవ్యాప్తంగా తీవ్రంగా ఖండిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ దాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
“మీడియా సంస్థపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్య. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు ఏమాత్రం స్థానం లేదు. దాడిలో పాల్గొన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించాను,” అంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు.
ఈ ఘటనపై రాష్ట్ర మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ‘ఎక్స్’ (పూర్వం ట్విట్టర్) వేదికగా తీవ్రంగా స్పందించారు. “హింసకు ప్రజాస్వామ్యంలో ఎలాంటి స్థానం లేదు. మీడియా సంస్థలపై దాడులు జరగడం అనేది ప్రజల అభిప్రాయ స్వేచ్ఛను అణచివేయాలనే దురుద్దేశంతో కూడిన చర్య,” అని వ్యాఖ్యానించారు.
అలాగే, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కు దెబ్బతీసే విధంగా జరిగిన ఈ ఘటన శాంతిభద్రతలకు విఘాతం కలిగించిందని తెలిపారు. దాడికి పాల్పడినవారిని మాత్రమే కాదు, వెనుక నుంచి ప్రోత్సహించినవారిని కూడా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
ఈ దాడిపై జర్నలిస్టులు, మీడియా సంఘాలు, పౌరసంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.