తెలంగాణ కాంగ్రెస్ లో ఎప్పటినుంచో ఉన్న అసంతృప్తులు ఇటీవల పీసీసీ కమిటీల ప్రకటన అనంతరం భగ్గుమన్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంపై ఇప్పటికే నిరసన గళం వినిపిస్తున్న పార్టీ సీనియర్లు ఇటీవల పరిణామాలతో ఆగ్రహంతో ఉన్నారు. టీడీపీ నుంచి వచ్చిన వారికే తెలంగాణ కాంగ్రెస్ లో ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో నేడు అత్యంత ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గాంధీభవన్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరగ్గా… 12 మంది నేతలు పార్టీకి రాజీనామా చేశారు. ఈ 12 మంది నేతలు గతంలో టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరినవారే!
రాజీనామా చేసిన వారిలో ధనసరి సీతక్క, విజయరామారావు, నరేందర్ రెడ్డి, ఎర్ర శేఖర్, చారగొండ వెంకటేశ్ తదితరులు ఉన్నారు. వీరు తమ రాజీనామా లేఖలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్చార్జి మాణికం ఠాగూర్ కు పంపినట్టు తెలుస్తోంది.
రేవంత్ అధ్యక్షతన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శులు కూడా హాజరయ్యారు.










