- దేశ సంపద కోటీశ్వరుల చేతికి
- జానెడు ఇచ్చి మూరెడు లాక్కొంటున్న జగన్
- వైసిపి, బిజెపి ప్రభుత్వాలను సాగనంపే వరకు పోరాటం
- సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ
తిరుపతి: గంజాయి, మత్తు పదార్థాల సరఫరాకు కేంద్రాలుగా అదానీ పోర్టులు మారిపోయాయి అని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ ధ్వజమెత్తారు. సంపద మొత్తం కోటీశ్వరుల చేతికి వెళ్లిపోతోంది అన్నారు. శుక్రవారం సాయంత్రం తిరుపతి నగరంలో సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభ కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూకాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో గ్యాస్ సిలిండర్ ధర 410 రూపాయలు ఉండగా బిజెపి ఆందోళన చేసిందని…నేడు మోడీ హయాంలో 1200 రూపాయలకు చేరింది అన్నారు. ఎన్నికల ముందు చెప్పిన ఒక్క హామీ కూడా నెరవేర్చ లేదు అన్నారు. నల్లదనం బయట తీస్తా అని, నోట్లు రద్దు చేసి బ్లాక్ మనీ మొత్తం తమకు కావాల్సిన వారి ఇళ్లకు చేర్చారని విమర్శించారు. కేంద్రం నుండి రాష్ట్రానికి దక్కాల్సిన హక్కులను ప్రశ్నించడంలో జగన్ ఘోరంగా విఫలం అయ్యారని అన్నారు. రాష్ట్రం నుండి కేంద్రానికి చెల్లించిన జీఎస్టీ డబ్బులు రాబట్టుకోవడానికి కూడా జగన్ సాహసం చేయడం లేదని చెప్పారు.ప్రజలకు జానెడు ఇచ్చి బారేడు లాక్కోవడం జగన్ విధానం అని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అన్నారు.
సారాయి, ఇసుక, చివరకు సినిమా టికెట్ల నుండి కూడా ప్రజల నుండి దండుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ అన్నారు.రాష్ట్రంలో దళితులపై వైసీపీ ప్రభుత్వం దాడులు చేస్తుందన్నారు. చివరకు ముఖ్యమంత్రి చిన్నాన్న కూడా దారుణ హత్యకు గురయ్యారని, ఎవరు హత్య చేశారో ప్రతి ఒక్కరికీ తెలుసు అన్నారు. ఇలాంటి కేసుల నుండి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వానికి దాసోహం అయిపోయాడని విమర్శించారు.వేలిముద్ర గాళ్ళకు ఓట్లు వేయించుకున్న ఘనత జగన్ జగన్ కే దక్కుతుందీ అన్నారు. వైసిపి, బిజెపి ప్రభుత్వాలను సాగనంపేందుకు విపక్షాలతో పాటు ప్రజలు కలిసిరావాలని పిలుపు నిచ్చారు. దేశాన్ని రక్షించుకోవాలంటే బీజేపీ వ్యతిరేక శక్తులు అన్ని ఏకం కావాలని కోరారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం మాట్లాడుతూ మోడీ దుర్మార్గ పాలన నుండి విపక్షాలతో పాటు ప్రజలందరూ చైతన్యంతో రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు.అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కనపెట్టి ఆర్ఎస్ఎస్ మనవాదం రాజ్యాంగాన్ని తీసుకొస్తున్నారనీ అన్నారు80 శాతం పేద బడుగు బలహీన వర్గాలను 20 శాతం ధనికులు శాసిస్తున్నారని చెప్పారు.బందిపోట్లు లాంటి దేశీయ విదేశ కార్పొరేట్ శక్తులతో మోడీ జత కట్టి దేశ సంపద దోచుకుంటున్నారని మండిపడ్డారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఓబులేసు మాట్లాడుతూ వైసిపి నేతలు కోట్లు మింగి ప్రజలకు బటన్ నొక్కి చిల్లర విదిలిస్తున్నరని అన్నారు. 14 లక్షల కోట్లు బ్యాంకుల నుండి రుణాలు ఇస్తే ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయారని, దీనికి ప్రధాన కారణం మోడీని అన్నారు. డిజల్, పెట్రోల్ ధరలు ప్రపంచం లో ఏ దేశం లో లేని విధంగా పెంచారని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న మోడీని సాగనంపాల్సిన సమయం ఆసన్నమైంది అన్నారు.
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామానాయుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జయలక్ష్మి, జిల్లా కార్యదర్శి మురళి, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, రాధాకృష్ణ, కుమార్ రెడ్డి, నదియా, కత్తి రవి, ఉదయ్, చలపతి, నగర కార్యదర్శి విశ్వనాథ్, సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు మురళి, జయ చంద్ర, సాయి లక్ష్మి, నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
ఈ సభలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి చిన్నం పెంచలయ్య, డప్పు కళాకారుల సంఘం నేత శ్రీనివాస్, జిల్లా నాయకులు నాగరాజు, సూరి ఆధ్వర్యంలో ఆలపించిన ఉద్యమ గేయాలు ఆకట్టుకున్నాయి.