పాడేరు మండలం, అల్లూరి జిల్లా – అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలోని వరంకూర గ్రామంలో ఆదివాసీ జీవితం ఇంకా ఆధునిక సౌకర్యాల వెలుతురు చూడలేదు. వనుగుపల్లి పంచాయతీ పరిధిలోని ఈ మారుమూల గిరిజన గ్రామంలో మాతృత్వం డోలీల భారం మోస్తోంది.
ఇటీవలే కొర్రా రత్నాలమ్మ అనే గర్భిణి స్త్రీ నొప్పులతో బాధపడుతుండగా, నడవడానికి ఏ మాత్రం శక్తి లేకపోవడంతో గ్రామస్తులు ఆమెను డోలీలో మోసుకెళ్లాల్సి వచ్చింది. దాదాపు మూడు కిలోమీటర్ల పాటు పర్వత ప్రాంతం గుండా డోలీ మోస్తూ వెళ్లిన దృశ్యం ఆదివాసీల బతుకుల బాధలను ప్రత్యక్షంగా చూపించింది.
ఈ ఘటన ఈ ప్రాంతంలో కనీస రవాణా సౌకర్యాల విలువను మరోసారి తెలియజేసింది. “ఇప్పటికీ మా గ్రామంలో రోడ్డు లేదు. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే మేము డోలీలే ఆసరాగా మిగిలిపోయాము,” అని స్థానికులు వాపోతున్నారు.
ప్రతి ఏడాది వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. అత్యవసర వైద్యం అందించాల్సిన సమయాల్లో రహదారి లేకపోవడం ప్రాణహానికి దారి తీస్తోంది.