హైదరాబాద్: బాచుపల్లిలో గత రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మియాపూర్–బాచుపల్లి ప్రధాన రహదారి పక్కన ఉన్న ఫర్నిచర్ దుకాణాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి తీవ్ర నష్టం కలిగించాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు, వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్టు సమాచారం.
మంగళవారం రాత్రి సుమారు 10:45 గంటల సమయంలో ఓ దుకాణంలో మొదలైన మంటలు క్షణాల్లోనే పక్కనున్న షాపులకు వ్యాపించాయి. దుకాణాల్లో కలప, ఫర్నిచర్, ఫోమ్ వంటి తేలికగా మండే పదార్థాలు అధికంగా ఉండటంతో అగ్నికీలలు భారీగా ఎగసిపడ్డాయి. అక్కడ సుమారు 25 ఫర్నిచర్ దుకాణాలు ఉండగా, నిమిషాల వ్యవధిలోనే 18 షాపులకు మంటలు వ్యాపించాయి.
కొందరు వ్యాపారులు దుకాణాల పక్కనే నివాసం ఉంటుండగా, అక్కడ నిల్వ ఉంచిన వంట గ్యాస్ సిలిండర్లు భారీ శబ్దాలతో పేలడం వల్ల మంటల తీవ్రత మరింత పెరిగింది. ఒక్కో షాపులో లక్షల రూపాయల విలువైన కలప సామాగ్రి నిల్వ ఉండటంతో ఆస్తి నష్టం భారీగా జరిగినట్లు అంచనా వేస్తున్నారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరుకు పైగా ఫైరింజన్లతో ఘటనాస్థలానికి చేరుకుని రాత్రంతా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఘటనపై బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నప్పటికీ ప్రాణనష్టం లేకపోవడం ఉపశమనం కలిగించింది.








