నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మండలం మామిడిపల్లిలో గ్రామంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే 137వ పోస్టర్ను ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు నిజామాబాద్ జిల్లా కార్యదర్శి దాసు మాట్లాడుతూ 1886 మే 1న అమెరికాలోని చికాగో నగర కార్మికుల రక్తం తో కలిసి ఎగిరిన జెండానే ఎర్రజెండా అని ఆయన కొనియాడారు. చికాగో కార్మికుల త్యాగ ఫలితమే ఎనిమిది గంటల పని విధానం దేశవ్యాప్తంగా వచ్చిందని ఆయన తెలిపారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేయడానికి కుట్ర చేస్తుందని, కార్మిక హక్కులను కాల రాస్తుందని ఆయన అన్నారు. ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు సూర్య శివాజీ మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు హరిస్తూ శ్రమదోపిడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వత్తాసు పలుకుతున్నాయని ఆయన అన్నారు. దేశీయ పరిశ్రమలను దెబ్బతీస్తూ ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటు వ్యక్తులకు అమ్మివేస్తూ కార్మికుల కొనుగోలు శక్తి నిర్వీర్యం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎండి ఖాజా మొయినుద్దీన్ మాట్లాడుతూ మేడే అమరవీరుల స్ఫూర్తితో శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి కార్మిక రాజ్య స్థాపనకై ఉద్యమించాలని ఆయన కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. ఈ పాత్రికేయుల సమావేశంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు సుంకర శ్రీనివాస్, అల్తాఫ్, భానుచందర్, వెంకటాపూర్ గంగారం, గోపి,భీడిల మదర్, లతీఫ్ పాష తదితరులు పాల్గొన్నారు.
