ఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో సంయవనం పాటించాల్సిన పాకిస్థాన్ సరిహద్దులో వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. నియంత్రణ రేఖ వద్ద దుశ్చర్యకు పాల్పడుతోంది. గత ఐదు రోజుల పాటు సరిహద్దులోకాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన దాయాది దేశం తాజాగా బుధవారం 6వ రోజు కూడా భారత సైన్యంపై కాల్పులకు తెగబడింది. దీంతో పాక్-భారత్ సరిహద్దులో రెండు దేశాల మధ్య ఏం జరుగుతోందో అన్న భయాందోళనలు నెలకొన్నాయి.
ఏప్రిల్ 29-30 అర్ధరాత్రి జమ్ముకశ్మీర్లోని నాలుగు సరిహద్దు జిల్లాల్లో పలు సెక్టార్లలో భారత సైన్యం పైకి కాల్పులు జరిపింది. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న పరగ్వాల్ సెక్టార్తో పాటు రాజౌరీ జిల్లాలోని సుందర్బనీ, నౌషెరా, అఖ్నూర్ సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులు జరిపినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. అయితే భారత సైన్యాన్ని లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్ కాల్పులకు పాల్పడినట్లుగా పేర్కొన్నాయి. అటూ బారాముల్లా, కుప్వారా జిల్లాల్లోనూ కవ్వింపు చర్యలకు దిగినట్లుగా తెలుస్తోంది. శత్రువుల దాడికి మన బలగాలు సమర్థమంతంగా తిప్పికొట్టాయని సైనిక వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 24 అర్ధరాత్రి నుంచి వరుసగా ప్రతిరోజూ పాక్ సైన్యం భారత దళాలపై ఎల్ఓసీ వెంబడి కాల్పులు జరుపుతున్నాయి. దీటుగా భారత్ ఆర్మీ బదులిస్తోంది.