contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ ను ఏకిపారేసిన భారత్

ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్‌పై భారత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఉగ్రవాదులకు తమ దేశం మద్దతు ఇవ్వడమే కాకుండా, వారికి శిక్షణ కూడా ఇస్తోందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్వయంగా అంగీకరించిన విషయాన్ని భారత్ ప్రముఖంగా ప్రస్తావించింది. పాకిస్థాన్ ఈ అంతర్జాతీయ వేదికను దుర్వినియోగం చేస్తూ, భారత్‌పై నిరాధార ప్రచారానికి పాల్పడుతోందని మండిపడింది.

భారత డిప్యూటీ పర్మినెంట్ రెప్రజెంటేటివ్ యోజన పటేల్ మాట్లాడుతూ, పాకిస్థాన్ తీరును తీవ్రంగా ఖండించారు. “ఒక నిర్దిష్ట ప్రతినిధి బృందం ఈ వేదికను దుర్వినియోగం చేయడం, దాని ప్రాముఖ్యతను తగ్గించడం దురదృష్టకరం. భారత్‌పై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రచారంలో మునిగి తేలుతున్నారు. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇటీవల ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో పాక్ ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడం, శిక్షణ, నిధులు సమకూర్చడం వంటి చరిత్రను అంగీకరించిన విషయాన్ని ప్రపంచమంతా విన్నది” అని యోజన పటేల్ గుర్తు చేశారు.

“ఈ బహిరంగ ఒప్పుకోలు ఎవరినీ ఆశ్చర్యపరచదు. ఇది ప్రపంచ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, ప్రాంతాన్ని అస్థిరపరుస్తున్న పాకిస్థాన్‌ను ఒక బాధ్యతారహిత రాజ్యంగా బయటపెడుతోంది. ప్రపంచం ఇకనైనా దీన్ని చూసీచూడనట్లు వదిలేయకూడదు” అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ప్రపంచవ్యాప్తంగా నాయకులు, ప్రభుత్వాలు అందించిన బలమైన, నిస్సందేహమైన మద్దతుకు, సంఘీభావానికి భారత్ కృతజ్ఞతలు తెలుపుతోందని ఆమె చెప్పారు. ఉగ్రవాదం పట్ల అంతర్జాతీయ సమాజం జీరో టాలరెన్స్‌తో ఉందని చెప్పడానికి ఈ మద్దతే నిదర్శనమని అన్నారు. 2008 నాటి ముంబై దాడుల తర్వాత పౌరులు అత్యధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోయింది పహల్గామ్ దాడిలోనేనని ఆమె గుర్తు చేశారు.

“ఐరాస భద్రతా మండలి తన ప్రకటనలో చెప్పినట్లుగా, ఇలాంటి నీచమైన ఉగ్రవాద చర్యలకు పాల్పడిన వారిని, వాటిని నిర్వహించిన వారిని, నిధులు సమకూర్చిన వారిని, స్పాన్సర్ చేసిన వారిని కచ్చితంగా బాధ్యులను చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టాలి” అని యోజన పటేల్ స్పష్టం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :