ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. దాడుల తీవ్రతకు టెహ్రాన్లోని అనేక కీలక ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని అధికారులు అత్యంత రహస్యంగా ఒక సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు అంతర్జాతీయ మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఈశాన్య టెహ్రాన్లోని ఒక పటిష్టమైన అండర్గ్రౌండ్ బంకర్లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నట్టు సమాచారం.
గత శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఖమేనీ నివాసం, ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉండే మోనిరియే ప్రాంతంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడినట్టు టెహ్రాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ పేలుళ్లు ఖమేనీ నివాసానికి చాలా దగ్గరగా సంభవించడంతో ఆయన భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో అధికారులు తక్షణమే స్పందించి అదే రోజు రాత్రి ఖమేనీని లావిజాన్ ప్రాంతంలో ఉన్న బంకర్కు తరలించినట్టు సదరు కథనాలు పేర్కొంటున్నాయి. గతంలో కూడా ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరినప్పుడు ఖమేనీ కుటుంబంతో సహా బంకర్లోకి వెళ్లిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేస్తున్నారు.
గత నాలుగు రోజులుగా ఇజ్రాయెల్ జరుపుతున్న ఈ భీకర దాడుల వల్ల ఇరాన్ వైపు భారీ నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అనేక మంది కీలక సైనికాధికారులు, అణుశాస్త్రవేత్తలు ఈ దాడుల్లో మరణించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇరాన్ సైనిక దళాల పర్యవేక్షకుడైన జనరల్ మహమ్మద్ బాఘేరి, రెవల్యూషనరీ గార్డ్స్ అధిపతి మేజర్ జనరల్ హొస్సేన్ సలామీతో పాటు ఆ విభాగానికి చెందిన ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా మృతిచెందిన వారిలో ఉన్నట్టు తెలిసింది.