contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రాష్ట్రానికి ఉన్న మొత్తం అప్పు ఇదే: జగన్

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ నేడు తాడేపల్లిలో ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు అంటేనే వంచన, తప్పుడు ప్రచారం అని అభివర్ణించారు. అందుకే ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటున్నారని ధ్వజమెత్తారు.

సాధారణ బడ్జెట్ అయితే… ఎన్నికల సమయంలో ఇచ్చిన మోసపూరిత హామీలన్నింటిని చూపించాల్సి వస్తుందని, అందుకే 7 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు గోబెల్స్ సిద్ధాంతాన్నే నమ్ముకున్నారని, చంద్రబాబు చెప్పిందే ఎల్లోమీడియాకు వేదం అని, చంద్రబాబు ఏం చెబితే అదే ఎల్లో మీడియా రాస్తుందని విమర్శించారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని నమ్మిస్తారని, ఆ తర్వాత తమ అజెండా అమలు చేస్తారని వ్యాఖ్యానించారు.

“ఇటీవలే మనందరికీ మొదటి స్టోరీ పరిచయం చేశారు. అదేంటంటే… రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోయిన పరిస్థితిలో ఉంది అనేదే ఆ స్టోరీ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనందువల్లే తాను రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నాడట. రాష్ట్రం నిజంగానే ఆర్థికంగా ధ్వంసం అయిపోయిందా అనే వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మీడియా కూడా బాధ్యతగా వ్యవహరించి, వాస్తవాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలి.

రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోయిందనే వాదనను చంద్రబాబు మీడియా సమావేశాల్లోనూ, గవర్నర్ ప్రసంగంలోనూ తీసుకొచ్చాడు. ఎన్నికల దగ్గర నుంచి చంద్రబాబు, ఆయన మీడియా ఊదరగొడుతున్నది ఏంటంటే… రాష్ట్రం రూ.14 లక్షల కోట్ల అప్పుల్లో ఉందట.

ఓవైపు రూ.14 లక్షల కోట్లు అప్పు ఉందని చెబుతూనే, మరోవైపు సూపర్-6 పథకాలు అన్నారు, సూపర్-7, సూపర్-10 అన్నారు. దేనికదే ప్రత్యేకంగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. చివరికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజలందర అడుగుతున్నారు. దాంతో, ఎన్నికల్లో తాను చెప్పిన రూ.14 లక్షల కోట్ల అప్పు అంశాన్ని గట్టిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం వచ్చింది. అందుకే మళ్లీ గోబెల్స్ ప్రచారం మొదలుపెట్టాడు.

కానీ వాస్తవం చెప్పాలంటే… అక్కడ రూ.14 లక్షల కోట్ల అప్పు నిజంగానే ఉందా? ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత లేనిది ఉన్నట్టు ఎలా చెప్పగలడు? బడ్జెట్ పత్రాల్లో ఇవన్నీ చూపించక తప్పదు కదా. కానీ, అవన్నీ చూపించలేని పరిస్థితి వచ్చేసరికి చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నాడు. ఇప్పటికే రెండుసార్లు రివ్యూ అన్నాడు, అధికారుల ట్రాన్స్ ఫర్ అన్నాడు… చివరికి గవర్నర్ ప్రసంగానికి వచ్చే సరికి రూ.14 లక్షల కోట్లను కాస్తా రూ.10 లక్షలకు తగ్గించాడు.

ఆ రూ.10 లక్షల కోట్ల విషయంలో అయినా గవర్నర్ తో నిజాలు చెప్పించాడా అంటే అదీ లేదు. ఓసారి నిజంగా రాష్ట్రంలో అప్పుల పరిస్థితి ఎలా ఉందో పరిశీలిద్దాం. నేను చెప్పేవన్నీ ఆర్బీఐ, కాగ్, స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్లలోని వివరాలు. చంద్రబాబు అనే వ్యక్తి గవర్నర్ తో కూడా అబద్ధాలు చెప్పించాడు, శ్వేతపత్రం పేరుతో మరీ అబద్ధాలు ఆడుతున్నాడు.

జూన్ నెల వరకు తీసుకుంటే ఏపీ ప్రభుత్వం నేరుగా చేసిన అప్పు రూ.5.18 లక్షల కోట్లు. 2014లో చంద్రబాబు అధికారంలోకి రాకముందు రూ.1,18,051 కోట్ల అప్పు ఉంటే… 2019లో చంద్రబాబు దిగిపోయే సమయానికి రూ.2,71,798 కోట్ల అప్పు ఉంది.

జూన్ లో మా పాలన ముగిసే సమయానికి ప్రభుత్వ అప్పు రూ.5.18 లక్షల కోట్లుగా ఉంది. వాటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ రుణాలు రూ.1.06 లక్షల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీ లేని రుణాలు రూ.1.23 లక్షల కోట్లు ఉన్నాయి. మొత్తమ్మీద పూర్తిస్థాయిలో రాష్ట్ర అప్పులు చూస్తే రూ.7.48 లక్షల కోట్లు” అని జగన్ వివరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :