కోరుట్ల : జిల్లాలో పోలీసు సేవల నాణ్యతను మెరుగుపర్చేందుకు చేపడుతున్న వార్షిక తనిఖీల్లో భాగంగా జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కోరుట్ల సర్కిల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కార్యాలయంలోని ముఖ్యమైన రికార్డులు — సర్కిల్ ఇన్ఫర్మేషన్ బుక్, క్రైం రికార్డు, ప్రాపర్టీ రిజిస్టర్, పిటిషన్ రిజిస్టర్ లను ఆయన సమీక్షించారు.
తనిఖీలో భాగంగా సర్కిల్ పరిధిలో నమోదైన గ్రేవ్ కేసులు, పాక్సో కేసులు, అలాగే విచారణలో ఉన్న సీడీ ఫైళ్లు, పెండింగ్, ట్రయల్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కేసుల పరిష్కారంలో నాణ్యతను పెంచేందుకు, SOP (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) ప్రకారం పరిశీలన చేయాలని ఎస్పీ సూచించారు. నిందితులకు శిక్షలు పడేలా క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని చెప్పారు.
ఇతర అంశాల్లో భాగంగా, 5S అమలును సమీక్షించారు. ఫైళ్లను సక్రమంగా నిర్వహించేందుకు, కార్యాలయ నిర్వహణను మెరుగుపరచేందుకు 5S విధానాన్ని పాటించాలని సూచించారు. సర్కిల్ పరిధిలో శాంతి భద్రతలు కాపాడేందుకు ఎస్సైలు కృషి చేయాలని కోరారు.
రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని, ప్రతి నెల వారి సంబంధించిన సమాచారం సేకరించి నమోదు చేయాలని సూచించారు. పోలీసు శాఖ ప్రజలకు మరింత దగ్గర కావాలన్న ఉద్దేశంతో కమ్యూనిటీ పోలిసింగ్ పై దృష్టి పెట్టాలని సూచించారు. సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలు, సామాజిక అంశాలపై అవగాహన కల్పించాలన్నారు.
ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ఎంత ముఖ్యమో ప్రజలకు తెలియజేయాలని, తద్వారా నేరాల నిరోధకానికి సహకరించేలా ప్రజలను ప్రోత్సహించాలని అన్నారు.
ఈ సందర్బంగా ఎస్పీ అశోక్ కుమార్ కోరుట్ల సర్కిల్ ఆవరణలో ఒక మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి డీఎస్పీ రాములు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కోరుట్ల సీఐ సురేష్ బాబు, ఎస్సైలు శ్రీకాంత్, శ్యామ్ రాజ్, నవీన్, రామచంద్రం, సుప్రియతో పాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.