జగిత్యాల జిల్లా, మెట్ పల్లి: నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో, శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, నేరాలను చాలా వరకు కట్టడి చేయవచ్చని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా మెట్ పల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన 70 సీసీ కెమెరాలను ఎస్పి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు అమూల్యమైన సాధనాలు అని ప్రతి వీధి, ప్రతి వాణిజ్య కేంద్రం, ప్రతి ముఖ్య కూడలి సీసీ కెమెరాల కనిపిస్తే, నేరాలు అరికట్టే అవకాశం పోలీసులకు లభిస్తుందని అన్నారు. ఇప్పటికే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వలన నేరాల గుర్తింపు, నిందితుల అరెస్టు, ట్రాఫిక్ నియంత్రణలో మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు. ప్రతి ఒక్కరూ సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం ద్వారానే నేర రహిత సమాజ నిర్మాణం సాధ్యమని అన్నారు. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు తదితర ఘటనలు జరిగిన పరిస్థితుల్లో సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకోవడానికి పోలీసులకు మూడో నేత్రంగా ఉపయోగపడుతుందన్నారు.ఈ యొక్క సీసీ కెమెరాల ఏర్పాటులో పోలీస్ లకు సహకరించి త్వరితగతిన ఏర్పాటు చేసినందుకు కృషి చేసిన స్థానికులను జిల్లా ఎస్పీ అభినందించి కృతజ్ఞతలు తెలియజేశారు. మెట్ పల్లి పరిసర ప్రాంత ప్రజలు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు గమనించినప్పుడు వెంటనే 100 నెంబర్ కి లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పీ రాములు, మెట్ పల్లి,కోరుట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్లు అనిల్, సురేష్ బాబు, ఎస్. ఐ లు కిరణ్ కుమార్, అనిల్,రాజు, మరియు సిబ్బంది పాల్గొన్నారు.