శ్రీనగర్ : పహల్గామ్ ఉగ్రదాడి తరువాత జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల కోసం భద్రతా సిబ్బంది, పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అనుమానితుల నివాసాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. పహల్గామ్ దాడి అనంతరం ఇప్పటివరకు వందకు పైగా అనుమానిత ఉగ్రవాదులు, వారి అనుచరుల నివాసాల్లో సోదాలు నిర్వహించినట్లు పోలీసులు వెల్లడించారు. బుధవారం ఒక్కరోజే 30కి పైగా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులకు సంబంధించిన 31 ఇళ్లల్లో పోలీసులు తనిఖీలు చేసి ఆయుధాలు, డిజిటల్ పరికరాలు, సంబంధిత పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్స్, సాక్షుల సమక్షంలో ఈ తనిఖీలు నిర్వహించారు. ఉగ్రవాదులకు పరికరాలు సమకూర్చిన కేసులో నిందితుడు అమిర్ గోర్జీ నివాసంలో కూడా పోలీసులు తనిఖీలు చేశారు. ఎన్ఐఏ 2021లోనే అతన్ని అరెస్టు చేసింది.