కాగజ్నగర్ : కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళలు, బాలికల భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని షీ టీం ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా ఎస్పీ నితిక పంత్, ఏఎస్పీ చిత్తరంజన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా షీ టీం ఇన్చార్జి ఏఎస్ఐ సునీత మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో మహిళలు తమ హక్కులపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరమని పేర్కొన్నారు. మహిళలపై జరిగే వేధింపులను అరికట్టేందుకు ఉన్న చట్టాలు, ఈవ్ టీజింగ్ నిరోధక చర్యలపై విద్యార్థినులకు వివరించారు.
అదేవిధంగా సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సైబర్ నేరాలకు గురికాకుండా ఉండే మార్గాలపై అవగాహన కల్పించారు. ఆపద సమయంలో వెంటనే డయల్ 100 సేవలను వినియోగించుకోవాలని, ఎలాంటి వేధింపులు ఎదురైనా భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అవసరమైన సమయంలో కాగజ్నగర్ షీ టీం మొబైల్ నంబర్ 8712670565 ను సంప్రదించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కె. శ్రీదేవి, అధ్యాపక బృందం, షీ టీం సభ్యులు బి. రమాదేవి, శ్రీనివాస్, సునీతతో పాటు విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








