- ప్రజా రహదారులపై ప్రైవేట్ గేట్లు
- నిబంధనలకు విరుద్ధంగా గేట్లు, బోర్డులు
- నిర్లక్ష్యంగా మున్సిపల్ అధికారులు
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా : కాగజ్ నగర్ మార్కెట్ ఏరియాలో అక్రమాలు అడ్డాలుగా మారాయి. ప్రజల రాకపోకలకు ఏర్పాటు చేసిన రహదారులను కొందరు వ్యాపార యజమానులు తమ సొంత ఆస్తుల్లా భావిస్తూ ఇష్టారాజ్యంగా ఆక్రమించుకున్నారు. రోడ్లపై ఇనుప గేట్లు దించి పూర్తిగా మూసివేయడంతో పాదచారులు నడిచే స్థలం కూడా లేకుండా పోయింది. మార్కెట్ ప్రాంతంలోని పలువురు షాపు యజమానులు రహదారులపై గేట్లు పెట్టి, వాటిని వ్యక్తిగత పార్కింగ్లుగా మలచుకున్నారు. కార్లు, బైకులు పార్క్ చేస్తూ ప్రజా మార్గాన్ని నిర్బంధించడం రోజువారీ అంశమైపోయింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈ రహదారులను పూర్తిగా బ్లాక్ చేసి, ప్రైవేట్ బోర్డులు కూడా అమర్చడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ పరిస్థితిపై మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో యజమానుల ధైర్యం మరింత పెరిగిందని చెప్పుకుంటున్నారు. వ్యాపార సముదాయాల ముందు ఉన్న ఖాళీ ప్రదేశాలు, ప్రజా రహదారులను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుని, వెంటనే ఆ గేట్లను తొలగించాలని కాగజ్ నగర్ ప్రజలు మున్సిపాలిటీని డిమాండ్ చేస్తున్నారు. ప్రజా రహదారులను ప్రైవేట్ ఆస్తులుగా మార్చుకునే హక్కు ఎవరికీ లేదని, అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.








