కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం చారిగాం శివారులో గత పదేళ్లుగా సాగుతున్న అక్రమ మట్టి మైనింగ్పై మాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెండుగురే శ్యామ్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వేలాది మెట్రిక్ టన్నుల మట్టిని తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం కలిగిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
వాస్తవానికి 4 ఫీట్ల మేర తవ్వకాలు జరిపినా మైనింగ్ అనుమతులు అవసరమని పేర్కొంటూ, చారిగాం పరిసరాల్లో లావని పట్టా భూముల్లో 30 నుండి 40 ఫీట్ల లోతు వరకు అక్రమంగా తవ్వకాలు జరిపి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపించారు.
చారిగాం రహదారి ఇప్పటికే ఇరుకుగా ఉన్నప్పటికీ, నిత్యం వందలాది ట్రాక్టర్లు రాకపోకలు సాగించడం వల్ల ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, ఎప్పుడైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ అంశాన్ని ఇప్పటికే 2026 జనవరిలో కలెక్టర్, సబ్ కలెక్టర్, మైనింగ్ మరియు ఎస్పీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, మూడు నెలలు గడిచినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై శ్యామ్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
చింతగూడెం బలగాల కొయ్యవాగు ప్రాంతంలో దాదాపు 10 ఎకరాల్లో అక్రమ మట్టి తవ్వకాలు జరిగాయని, అక్కడ జరిగిన అవకతవకలు బయటపడినా అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు.
ఈ అక్రమ మైనింగ్ వ్యవహారంలో కలీం బేగ్ కీలక పాత్ర పోషిస్తున్నారని శ్యామ్ రావు పేర్కొన్నారు. గతంలో ఈ అక్రమాలను ప్రశ్నించిన పాత్రికేయుడు అంగాల తిరుపతిపై కలీం బేగ్ మరియు అతని అనుచరులు దాడి చేసిన ఘటనను ఆయన గుర్తు చేశారు. గత పాలకుల అండదండలతోనే పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసులను నీరుగార్చారని విమర్శించారు.
ఈ నేపథ్యంలో వెంటనే అక్రమ మైనింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని మాలి సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు.








