contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పంచ భూతాలను కాపాడుకునే మార్గం ప్రకృతి వ్యవసాయం – పీఠాధిపతి – డా॥ ఉమర్ ఆలీషా

పిఠాపురం : ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించడం ద్వారా పంచ భూతాలను కాపాడుకోవచ్చునని, పంచభూతాలతో కూడిన ప్రకృతిని కాపాడుకుంటేనే భావితరాలకు మనుగడ ఉంటుందని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. ఎరువాక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని పిఠాపురం, కాకినాడ రోడ్ నందలి నూతన ఆశ్రమ ప్రాంగణంలో బుధవారం ఏర్పాటుచేసిన సస్యవృద్ధి బీజారోపణోత్సవం కార్యక్రమంలో ఆలీషా మాట్లాడుతూ వ్యవసాయానికి భూమిని సిద్ధం చేసుకునే సమయంలో జరుపుకునే వేడుక ఎరువాక పౌర్ణమి అని పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలో ఆసక్తి తగ్గిపోతున్న ఈ రైతు పండుగకు ప్రాముఖ్యతను పెంచి రైతులలో వ్యవసాయం పట్ల ప్రేరణ కలిగించడం కోసం ఎరువాక సాగే సాంప్రదాయాన్ని ఎరువాక పౌర్ణమి రోజున గత 6 సంవత్సరాలుగా తమ ఆశ్రమం వద్ద నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ప్రకృతిని ఆరాధిస్తూ, ప్రకృతిలో ఉండే పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ, సేంద్రీయ ప్రకృతి పద్ధతుల ద్వారా మానవుడు తన మనుగడకు కావలసిన ఆరోగ్యకరమై ఆహార ఉత్పత్తులను సాధించే వ్యవసాయమే ఆధ్యాత్మిక వ్యవసాయమని ఆయన అన్నారు. ఆధ్యాత్మిక వ్యవసాయ ప్రక్రియకు స్ఫూర్తి ప్రేరణ కలిగించే విశిష్ట కార్యక్రమమే సస్యవృద్ధి బీజారోపణోత్సవము అని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని అందుకోసం ప్రతి సభ్యుడు మూడు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. నాటే ప్రతి మొక్క ఒక్కో ఆక్సిజన్ సిలిండర్ తో సమానమని తెలిపారు. ఎరువాక పౌర్ణమి సందర్బంగా ఆశ్రమ ప్రాంగణంలోని వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన ఎరువాక కార్యక్రమంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా ముఖ్య అతిధులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న విశిష్ట రైతులు దారపు రెడ్డి వెంకన్న (ఎల్.అగ్రహారం), దార్లంక సూరిబాబు (మల్లేపల్లి), యాండ్ర చంద్రావతి (రఘుదేవపురం), దాసరి పెద్దనాగేశ్వరరావు (బావాజి పేట), గుళ్ళపల్లి వీరభద్రరావు (ఇసుక పల్లి ఉప్పరగూడెం)లను ఘనంగా సత్కరించారు. తదుపరి పరబ్రహ్మ మొహియద్దీన్ బాద్షా ఆధ్యాత్మిక వ్యవసాయం 2025 పురస్కారాన్ని పశ్చిమగోదావరి జిల్లా చీమలవారి గూడెంనకు చెందిన ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయదారుడు, శిక్షకుడు ప్రచారకర్త, చీమల వెంకటేష్ కు అందజేసి పదివేల రూపాయల నగదు పురస్కారాన్ని, జ్ఞాపికను బహుకరించి ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త నడింపల్లి రామగోపాల వర్మ డ్రోన్లతో వ్యవసాయం, బహుముఖ ప్రయోజనాలు, డ్రోన్ పైలెట్ శిక్షణ గురించి రైతులకు వివరించారు. అంబాజీపేట హార్టికల్చర్ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.బి.వి.చలపతి వివిధ పంటలలో జీవ నియంత్రణ పద్ధతులను గురించి తెలిపారు. ప్రకృతి వ్యవసాయ నిపుణులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ జాయింట్ సెక్రెటరీ వాసంశెట్టి సత్య నారాయణమూర్తి, గోలి సుభాష్, పృథ్వీరాజ్ కఠారి, పొట్రు శశికాంత్ లు సమీకృత ప్రకృతి వ్యవసాయం గురించి వివరించారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ప్రేమికుడు కెప్టెన్ అజ్జరపు మల్లికార్జున రావు, ఎస్సార్ కార్పొరేషన్ మాజీ సీఈవో జి.వి.కృష్ణంరాజులు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం గురించి తెలిపారు. తదుపరి ముఖ్య అతిధులను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. తదుపరి విశిష్ట రైతులు, పురస్కార గ్రహీత, ముఖ్య అతిధులు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషాను ఘనంగా సత్కరించి పర్యావరణ పరిరక్షణ కొరకు పీఠాధిపతి చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ కార్యక్ర మంలో పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు ఎ.వి.వి.సత్యనారాయణ, ఎన్.టి వి.ప్రసాద్ వర్మ, పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, అహ్మద్ ఆలీషా, హుస్సేన్ షా, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, కోరుపల్లి అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :