contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

బీఆర్ఎస్ మహాధర్నాపై మహిళల మండిపాటు .. కాంగ్రెస్ నేతల అరెస్టు.

  •  అవకతవకల ఆరోపణలపై లబ్ధిదారుల ఆందోళన
  •  మహిళలతో సహా కాంగ్రెస్ నేతల అరెస్టు..
  •  అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులు..
  •  పోలీసుల తీరుపై ఎమ్మెల్యే కవ్వంపల్లి ఆగ్రహం

 

కరీంనగర్ జిల్లా: ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికే కట్టబెట్టారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ నేతలు మహాధర్నాకు పూనుకోవడంపై ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులైన మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కోపోద్రిక్తులైన మహిళలు గురువారం మానకొండూర్ మండల కేంద్రానికి తరలి వచ్చి ఆందోళన చేపట్టడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అకవకతవకలు జరిగాయని, కాంగ్రెస్ పార్టీ వాళ్లకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారంటూ బీఆర్ఎస్ పార్టీ వాళ్లు మహాధర్నా చేపట్టడాన్ని నిరసిస్తూ మహిళలు ప్రధాన రహదారిపై ఇందిరమ్మ ఇళ్ల నమూనా బొమ్మలతో రోడ్డుపై ధర్నా అనంతరం రాస్తారోకో నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్లపై తప్పుడు ఆరోపణలు చేయడంపై ఆగ్రహిస్తూ మహిళలు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు వ్యతిరేకంగా మహిళలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తమకు ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదని, చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేస్తుంటే గిట్టని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుమ్మెత్తి పోశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు రావడం బీఆర్ఎస్ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వారు విమర్శించారు. పదేళ్లలో ఒక్క ఇల్లు కట్టించి ఇవ్వని బీఆర్ఎస్ నాయకులకు ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని వారు నిలదీశారు.
అధికారంలోకి వచ్చిన 18 నెలలకే ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇస్తుంటే బీఆర్ఎస్ నేతలకు కంటగింపు ఉందని వారు విమర్శించారు. నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు దక్కకుండా చేసే గులాబీ నేతలకు తగిన శాస్తి చేస్తామని వారు హెచ్చరించారు. ఇదిలా ఉండగా, రాస్తారోకోతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి, పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళనకారులను రోడ్డుపై నుంచి చెదరగొట్టారు. అనంతరం వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

అయినప్పటికీ మహిళలు ఇంకా వస్తూనే ఉండటంతో ఆ ప్రాంతం మహిళలో నిండిపోయింది. దీంతో మహిళలు మరింత ఉత్సాహంతో రసమయి బాలకిషన్ కు వ్యతిరేకంగా మరోమారు ఆందోళనకు ఉపక్రమించారు. ఒక వైపు బీఆర్ఎస్ వాళ్ల ధర్నా, మరో వైపు ఆ ధర్నాకు వ్యతిరేకంగా మహిళలు ధర్నా చేస్తుండటంతో వాతావరణం వేడెక్కిపోయింది. పోలీసులు అప్రమత్తమై ఆందోళన చేస్తున్న మహిళలను, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి వాహనాల్లో పోలీసు స్టేషన్ కు తరలించారు. పరుగు తీస్తున్న వారి వెంటబడి పట్టుకొని వాహనాల్లోకి ఎక్కించారు. మహిళలను అరెస్టు చేసే విషయంలో పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ హంగామా చేశారు. మహిళల ఆందోళనపై పోలీసులు ఆంక్షలు విధించడం, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న మహిళను బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వాహనాల్లో ఎక్కించడం విమర్శలకు తావిస్తోంది. అరెస్టు చేసిన వారినంతా వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. అరెస్టయిన వారిలో మానకొండూర్, తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నందగిరి రవీంద్రచారి, బండారి రమేశ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దూలం దేవేంద్ర, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్, వైస్ చైర్మన్ తిరుమల్ రెడ్డి, పార్టీ నాయకులు సుధగోని లక్ష్మినారాయణగౌడ్, తాళ్లపల్లి సంపత్ గౌడ్, గోపు మల్లారెడ్డి, ద్యావ శ్రీనివాస్ రెడ్డి, మోరపల్లి రమణారెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాసరావు, కుంట రాజేందర్ రెడ్డి,బుధారపు శ్రీనివాస్,కొత్త తిరుపతిరెడ్డి, చింతల లక్ష్మారెడ్డి, గొట్టిముక్కుల సంపత్ రెడ్డి, పోలు రాము,రమేశ్, రేమిడి తిరుపతి, బండి మల్లేశం, కోండ్ర సురేష్,మడుపు ప్రేమ్ కుమార్, కనకం అశోక్, శ్రీనివాస్ రెడ్డి, కనకం లక్ష్మణ్, సాయిరి దేవేందర్, మల్లికార్జున్,సహదేవ్, రామకష్ణ,పోతుగంటి శ్రీనివాస్,బి.శ్రీధర్,ఎం.తిరుపతిరెడ్డి,భోళ్ల మురళీధర్,చిరంజీవి తదితరులు ఉన్నారు.

◆ పోలీసుల తీరుపై ఎమ్మెల్యే కవ్వంపల్లి ఆగ్రహం

ఇదిలా ఉండగా, మానకొండూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులైన మహిళలు చేపట్టిన ధర్నాకు పోలీసులు అడ్డుచెప్పడం, ఆందోళనకారులను లాక్కెళ్లి వ్యాన్లలో ఎక్కించడంపై మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఉన్న ఎమ్మెల్యే పోలీసుల నిర్వాకాన్ని డీజీపీ దృష్టకి తీసుకువెళ్లారు. అంతేకాకుండా ఈ విషయంలో ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

◆ మహాధర్నాకు స్పందన కరువు..

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవకతవకలు జరిగాయని, కాంగ్రెస్ పార్టీ వాళ్లకే ఇళ్లు మంజూరు చేస్తున్నారని ఆరోపిస్తూ గురువారం బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన మహా ధర్నాకు ఆదరణ లభించలేదు. ఈ మహాధర్నాకు ప్రజలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులుగా ఎంపిక కాని వారంతా భారీగా తరలి రావాలని పిలుపు ఇచ్చినప్పటికీ ప్రజల నుంచి స్పందన కరువైంది. జనం లేక వెలవెలబోయింది. దీనికితోడు పోలీసుల హెచ్చరికలతో బీఆర్ఎస్ నాయకులు మహాధర్నాను త్వరగానే ముగించారు.ఆ పార్టీ నాయకుల ప్రసంగాలు జరుగుతుండగానే టెంట్ ను తొలగిస్తుండటం గమనార్హం.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :