కరీంనగర్లో పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ, అవగాహనా కార్యక్రమం
కరీంనగర్ జిల్లా: అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని (ప్రపంచ మాదకద్రవ్యాల దినోత్సవం) పురస్కరించుకుని, కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలో గురువారం 2 కిలోమీటర్ల మేర ర్యాలీని నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశ్యం… ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జెండా ఊపి ప్రారంభించగా, కరీంనగర్ కలెక్టరేట్ నుండి ప్రారంభమై, ప్రతిమ మల్టీప్లెక్స్ జంక్షన్ నుండి తెలంగాణ చౌక్ మీదుగా పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని పరేడ్ గ్రౌండ్ వద్ద ముగిసింది. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మున్సిపల్ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా ఉన్నత అధికారులు, వివిధ కళాశాలల విద్యార్థులు, ఎన్సిసి క్యాడెట్లు, పోలీసులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం, కమిషనరేట్ కేంద్రంలోని అస్త్ర కన్వెన్షన్ సెంటర్ నందు “సే నో టు డ్రగ్ – సే ఎస్ టు లైఫ్” (SAY NO TO DRUG – SAY YES TO LIFE) అనే నినాదంతో ఒక అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ, ముఖ్యంగా యువత మరియు విద్యార్థులలో మాదకద్రవ్య దుర్వినియోగానికి వ్యతిరేకంగా సందేశాన్ని వ్యాప్తి చేయడానికి మరియు పోరాడటానికి ప్రభావవంతమైన అవగాహన కార్యక్రమాలు మరియు ప్రజాభాగస్వామ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జూన్ 20, 2025 నుండి జూన్ 26, 2025 వరకు అవగాహన వారం నిర్వహిస్తున్నందున, కరీంనగర్ కమిషనరేట్లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అవగాహన ప్రచారం మరియు కార్యక్రమాలను చేపట్టామన్నారు. ప్రతి సంవత్సరం జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటారు. రాష్ట్రాన్ని మాదకద్రవ్య రహితంగా మార్చాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా, హైదరాబాద్లోని TGANB డైరెక్టర్ రాష్ట్రవ్యాప్తంగా పలు సూచనలు చేశారు. ఈ సంవత్సరం ప్రపంచ మాదకద్రవ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, TGANB విద్యా శాఖ, వికలాంగులు, సీనియర్ సిటిజన్లు & ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత విభాగం (DEPWD SC & TGP) మరియు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK) సహకారంతో “నషా ముక్త్ భారత్ అభియాన్ (NMBA)” కింద రాష్ట్రవ్యాప్త కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించింది. కమీషనర్ తమ ప్రసంగంలో, విద్యార్థి దశలో వివిధ కారణాల వల్ల ఒత్తిడికి లోనై, చెడు స్నేహాల వలన మాదక ద్రవ్యాల వినియోగం వల్ల మానసికంగా మరియు శారీరకంగా తీవ్రంగా నష్టపోతారని, కొన్ని సందర్భాల్లో జీవితాలను సైతం కోల్పోతారని తెలిపారు. దీని నిర్మూలనకు విద్యార్థి దశలోనే మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా, మాదకద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో భాగస్వామ్యులై, డ్రగ్ రహిత సమాజ నిర్మాణం కోసం పాటుపడతామని పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం తో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు మరియు అధికారులంతా ప్రతిజ్ఞ చేసారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, రూరల్ ఏసీపీ ఏఎస్పీ శుభం ప్రకాష్ ఐపీఎస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి పర్విన్, ఏసీపీలు వెంకటస్వామి (టౌన్), విజయ్ కుమార్ (సీసీఆర్బి), ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.