contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సంయమనం పాటిస్తున్నా .. సహనాన్ని పరీక్షించొద్దు : కవ్వంపల్లి సత్యనారాయణ

  • అక్రమార్కుల బండారం బయట పెడతా
  •  ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు
  • రసమయికి ఎమ్మెల్యే కవ్వంపల్లి హెచ్చరిక

 

కరీంనగర్ జిల్లా:గత బీఆర్ఎస్ హయాంలో అక్రమాలకు, ఆక్రమణలకు పాల్పడిన వారి భరతం పడతానని, ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు. శనివారం ఎల్ఎండీ కాలనీలో క్యాంపు కార్యాలయంలో తిమ్మాపూర్ మండలానికి చెందిన సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు ఆయన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతుంటే పనీ పాట లేని రసమయి బాలకిషన్,అతని అనుచరులు అడ్డగోలుగా ఆరోపణలు చేస్తూ బురుదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత కాలంగా పథకం ప్రకారం అసత్యపు ఆరోపణలతో దుష్ప్రచారం కొనసాగిస్తున్నారని, అప్పుడప్పుడు ఖండించినా తీరుమార్చుకోవడం లేదన్నారు. ఇంతకాలం సంయమనం పాటిస్తూ వస్తున్నానని, ఇంకా సహనాన్ని పరీక్షించొద్దని కవ్వంపల్లి పేర్కొన్నారు. ఇక నుంచి ఎవరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతల అక్రమ కట్టడాలను, ఆక్రమణలు తొలగించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇక ముందు కూడా అలాంటి అక్రమార్కుల భరతం పడతానని ఆయన హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన దళిత బందులో అనేక అవకతవకలు జరిగాయని, బీఆర్ఎస్ కార్యకర్తలనే లబ్ధిదారులుగా ఎంపిక చేశారని, లంచాలు తీసుకొని యూనిట్లు ఇప్పించిన విషయం మానకొండూర్ నియోజకవర్గ ప్రజలందరికీ తెసుసని ఆయన పేర్కొన్నారు. దళిత బంధులో మూడు లక్షలు తీసుకొంటున్నారని సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విషయాన్ని ఆయన ఉటంకించారు. పదేళ్లు అధికారం కట్టబెడితే ఆటపాటలతోనే కాలంగడిపిన రసమయి పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించిన పాపాన పోలేదని, పేదల సంక్షేమాన్ని గాలికొదిలారని ఎద్దేవా చేశారు. పదేళ్ల కాలంలో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎన్ని కట్టించావో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్లు ఇవ్వలేని రసమయి కూడా పేదోళ్లకు ఇళ్లు ఇస్తుంటే జీర్ణించుకోలేక ఆ పథకం అమలుపై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నదని చెప్పారు. బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షునికి కూడా ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామంటే ఇంతకు మించిన పారదర్శత ఇంకేముందని ఆయన ప్రశ్నించారు. వాస్తవాలు తెలుసుకోకుండా వాగడం సరికాదన్నారు. పేదల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం కావాలని, ఆ లక్ష్య సాధన కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని ఆయన చెప్పారు. అమలులో ఉన్న ఉచిత బస్సు ప్రయాణాలపై బీఆర్ఎస్ వాళ్లు చెత్తవాగుడు వాగుతూ మహిళలను అవమానపరుస్తున్నారని ఆయన విమర్శించారు. ఉచిత విద్యుత్ ప్రయోజనాలను పేదలు పొందుతున్నారన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దొడ్డు బియ్యానికి బదులుగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రైతులకు 2 లక్షల వరకు రుణాలను మాఫీ చేశామని, తాజా రైతు భరోసా కింద 9000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. గత ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల మంజూరు కావడం గగనమయ్యేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చెక్కుల మంజూరు వేగవంతమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 16 విడతల్లో చెక్కులు మంజూరయ్యాయని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు మానకొండూర్ నియోజకవర్గంలో 5557 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 14.98 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందిందని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి వివరించారు.

ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేశ్, మాజీ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్ఎల్ గౌడ్, పార్టీ నాయకులు గోపు మల్లారెడ్డి, సిరిగిరి రంగారావు,కుంట రాజేందర్ రెడ్డి, చింతల లక్ష్మారెడ్డి, కొత్త తిరుపతిరెడ్డి, రాములు యాదవ్, మాచర్ల అంజయ్య, గొట్టెముక్కుల సంపత్ రెడ్డి, బుధారపు శ్రీనివాస్, కొత్త రాజిరెడ్డి తోపాటు వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :