కరీంనగర్ జిల్లా: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో దశాబ్ద కాలంపైగా సేవలు అందించిన పోలీస్ జాగిలాలు డానీ (డాబర్మాన్) మరియు టైగర్ (జర్మన్ షెపర్డ్) నేడు ఘనంగా ఉద్యోగ విరమణ చేశాయి. ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ ఆధ్వర్యంలో అస్త్ర కన్వెన్షన్లో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
డానీ (10 సంవత్సరాలు), టైగర్ (11 సంవత్సరాలు) డాగ్ స్క్వాడ్ విభాగానికి విశేష సేవలందించాయి. ముఖ్యంగా దొంగతనాలు మరియు హత్య కేసులలో ట్రాకర్ డాగ్లుగా కీలక పాత్ర పోషించి, పోలీసు శాఖకు ఎంతో సహాయపడ్డాయి. 2014లో టైగర్, 2015లో డానీ పోలీసు శాఖలో చేరాయి.
ఉద్యోగ విరమణ పొందుతున్న పోలీస్ జాగిలాలను పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా జాగిలం టైగర్కు హ్యాండ్లర్గా వ్యవహరించిన కానిస్టేబుల్ మహేందర్, అలాగే జాగిలం డానీకి హ్యాండ్లర్గా వ్యవహరించిన కానిస్టేబుల్ జి. మురళిలను కూడా శాలువాతో సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ, పోలీస్ శాఖలో జాగిల విభాగం చాలా కీలకమైనదని అన్నారు. నేరస్తులను పట్టుకోవడంతో పాటు, పేలుడు పదార్థాలు మరియు ప్రస్తుతం మత్తు పదార్థాలను గుర్తించడంలో పోలీస్ జాగిలాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు వెంకటరమణ, భీం రావు, ఆర్.ఐ. రజినీకాంత్, ఇతర పోలీస్ కమిషనరేట్ అధికారులు మరియు డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.