కరీంనగర్ జిల్లా: చొక్కారావుపల్లి – ఖాజీపూర్ గ్రామాల మధ్య గల మానేరు వాగుపై వంతెన నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సన్మానించారు. బుధవారం ఆయన పార్టీశ్రేణులతో కలిసి కరీంనగర్ లోని కేంద్ర మంత్రి నివాసానికి వెళ్లి బండి సంజయ్ కుమార్ కు శాలువా కప్పి సన్మానించారు. నిధులు మంజూరు చేయించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ వంతెన నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరుకు చేసిన కృషి శ్లాఘనీయమని బండిని కొనియాడారు. నిధుల మంజూరుతో ఏళ్ల నాటి వంతెన కల సాకారం కానున్నదని ఆయన పేర్కొన్నారు. నిధుల మంజూరుతో ఆ ప్రాంత ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన చెప్పారు. అనంతరం కరీంనగర్ చైతన్యపురిలోని మహాశక్తి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ బండ్రు శోభారాణి,గన్నేరువరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, పార్టీ నాయకులు బండారి రమేశ్, మోరపల్లి రమణారెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాసరావు, కుంట రాజేందర్ రెడ్డి, శ్రీగిరి రంగారావు, మామిడి అనిల్ కుమార్, చింతల లక్ష్మారెడ్డి, కొమ్మెర రవీందర్ రెడ్డి, కొత్త తిరుపతిరెడ్డి, ఆకుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
