- రాజీవ్ రహదారి గుండ్లపల్లి స్టేజి దిగ్బంధం..
- పోలీసుల సూచనతో శాంతించిన యువజన సంఘాలు..
కరీంనగర్ జిల్లా: రాజీవ్ రహదారి గుండ్లపల్లి స్టేజి వద్ద డబుల్ రోడ్డు పనులకై గన్నేరువరం మండల యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ధర్నా విజయవంతమైంది. యువజన సంఘాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రాజీవ్ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ మండల ప్రజలు శిథిలమైన రోడ్డుతో నానా అవస్థలు పడుతుంటే ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రోడ్డు నిర్మాణానికి ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఆరు నెలల సమయంలో రోడ్డు పనులు పూర్తి చేయాలని లేని పక్షాన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 15 రోజుల్లో రోడ్డు పనులు తిరిగి ప్రారంభిస్తానని తెలిపిన ఎమ్మెల్యే అదే మాటకు కట్టుబడి కాంట్రాక్టర్ తో రోడ్డు పనులు చేయించాలని కల్వర్టులను బ్రిడ్జిలుగా మార్చాలని డిమాండ్ చేశారు. ఇదే మాదిరి నిర్లక్ష్యం చేస్తే యువజన సంఘాల ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు ఎదురైనటువంటి ప్రతిఘటన కవంపల్లి సత్యనారాయణ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తమ పిలుపుమేరకు తరలివచ్చిన వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలకు నాయకులకు యువజన సంఘాల నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇకముందు రోడ్డు కోసం చేసే ఉద్యమంలో ప్రతి ఒక్కరు ఇదే మాదిరిగా సహకరించాలని కోరారు.










