కరీంనగర్ జిల్లా: కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ఆదేశాల మేరకు, శనివారంనాడు కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ అధికారులు నగరంలో విస్తృత వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ తనిఖీలలో, ముఖ్యంగా కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలలో, సరైన నెంబర్ ప్లేట్లు (రిజిస్ట్రేషన్ ప్లేట్లు) లేని వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా మొత్తం 73 వాహనాలను గుర్తించి, వాటి యజమానులపై మోటార్ వాహనాల చట్టం ప్రకారం జరిమానాలు విధించారు. జరిమానాలు విధించిన అనంతరం, ఆయా వాహనాలకు తక్షణమే సరైన నెంబర్ ప్లేట్లను బిగింపజేసి పంపినట్లు కరీంనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టరు శ్రీ కరీంఉల్లాఖాన్ తెలిపారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ కరీంఉల్లాఖాన్ మాట్లాడుతూ, పౌరులు రోడ్డు భద్రతా నియమాలను, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, సరైన నెంబర్ ప్లేట్లు కలిగి ఉండటం చట్ట ప్రకారం అత్యవసరమని, భవిష్యత్తులో కూడా ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.









