కరీంనగర్ జిల్లా : జిల్లా స్థాయి మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జంగపల్లి విద్యార్థులు రాపోలు శివ సాయి, చొక్కల వర్షిని మరోసారి ప్రతిభ చాటి రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందారు. నిన్న రాష్ట్ర మ్యాథ్స్ ఫోరం ఆధ్వర్యంలో గజ్వేల్లో 33 జిల్లాల నుంచి ఎంపికైన విద్యార్థులకు నిర్వహించిన రాష్ట్రస్థాయి మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్లో రాపోలు శివ సాయి 60 మార్కులకు గాను 54 మార్కులు సాధించి తృతీయ స్థానం దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మ్యాథ్స్ ఫోరం ప్రతినిధులు శివ సాయిని శాలువాతో సత్కరించి, ర్యాంక్ సర్టిఫికెట్తో పాటు రూ.2,000 నగదు బహుమతిని అందజేశారు. పోటీలో పాల్గొన్న విద్యార్థులందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందించారు.
అనంతరం జంగపల్లి గ్రామంలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి తాడూరి కరుణశ్రీ వెంకటరమణారెడ్డి శివ సాయికి ప్రత్యేకంగా నగదు బహుమతిని అందజేసి అభినందించారు. విద్యార్థుల విజయంలో కీలక పాత్ర పోషించిన మ్యాథ్స్ ఉపాధ్యాయులు శ్రీ శంకర రావును కూడా సర్పంచ్ ఘనంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ప్రభాకర్, 10వ వార్డు మెంబర్ ప్రదీప్ పాల్గొన్నారు. ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లను ప్రధానోపాధ్యాయురాలు శారద, ఉపాధ్యాయ బృందం శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సర్పంచ్ మాట్లాడుతూ, పదవ తరగతిలో మంచి మార్కులు సాధించిన ప్రతి విద్యార్థికి వెయ్యి రూపాయల నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు. సర్పంచ్ ప్రకటనకు ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.









