- అడ్డుకోవడానికి వెనుకంజ వేస్తున్న అధికారులు
కరీంనగర్ జిల్లా: ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతున్నది. గన్నేరువరం మండలంలోని చొక్కారావుపల్లె గ్రామంలోని బిక్కు వాగు నుంచి యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. సొంత అవసరాలకు స్థానికంగా వున్న వాగులు నుంచి ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చని ప్రభుత్వం కల్పించిన వెసులుబాటును కొంతమంది అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకుని దర్జాగా వ్యాపారం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించి భారీగా ఆర్జిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామానికి చెందిన ఇసుక ట్రాక్టర్ల ఓనర్లు జెసిబి సహాయంతో చొక్కారావుపల్లె బిక్కు వాగు రోడ్ కింద ఉన్న పైపులకు వరద నీరు రాకుండా అడ్డంగా మట్టి పోసి వదిలేశారు. దీంతో చొక్కారావుపల్లె గ్రామస్తులతో కలిసి సర్పంచి ట్రాక్టర్లను అడ్డుకున్నారు. ట్రాక్టర్ల యజమాన్యంతో మాట్లాడి మట్టిని తొలగించాలని చెప్పగా గ్రామస్తులతో ట్రాక్టర్ ఓనర్లు వాగ్వాదానికి దిగారు. సర్పంచి అరికాంతం గోపాల్ రెడ్డి గన్నేరువరం, ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ ఎస్ఐలకు సమాచారం ఇవ్వగా ఇప్పటివరకు స్పందించలేదని అన్నారు. సమస్యను పరిష్కరించాలని చొక్కారావుపల్లె గ్రామస్తులు కోరుతున్నారు.








