కరీంనగర్ జిల్లా, గంగాధర మండలంలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించే దిశగా కీలక కార్యక్రమం చేపట్టారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో జరుగుతున్న రెండవ దశ “Arrive Alive” రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా శనివారం మధురానగర్ గ్రామంలోని VAS గార్డెన్స్ వద్ద ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
లయన్స్ క్లబ్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల కంటి చూపు అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. డ్రైవర్లు తమ ఆరోగ్యంపై, ముఖ్యంగా కంటి చూపుపై శ్రద్ధ పెట్టడం ద్వారా తమ ప్రాణాలతో పాటు ఇతరుల భద్రతను కూడా కాపాడవచ్చని సూచించారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడమే ఈ శిబిరం ప్రధాన లక్ష్యమని వివరించారు.
ఉదయం 10 గంటల నుండి ప్రారంభమైన ఈ శిబిరానికి ప్రాంతీయ వాహన డ్రైవర్ల నుండి విశేష స్పందన లభించింది. ఆటో, లారీ, కార్ తదితర వాహన డ్రైవర్లు పెద్ద సంఖ్యలో హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. నిపుణులైన వైద్య బృందం సమగ్ర పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించడంతో పాటు తగిన సూచనలు కూడా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, చొప్పదండి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, రజిని, మండల ఎంపీడీఓ రాము, తహశీల్దార్ రజిత పాల్గొన్నారు. అదనంగా గంగాధర, చొప్పదండి పరిధిలోని ఎస్ఐలు వంశీకృష్ణ, రాజు, నరేష్ రెడ్డి, స్థానిక సర్పంచ్లు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ శిబిరం ద్వారా డ్రైవర్లలో ఆరోగ్య అవగాహన పెంపొందడంతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు దోహదం అవుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.







