కరీంనగర్ : కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో భారీ ఆర్థిక కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మరణించిన పోలీసు సిబ్బంది పేర్లతో జీతాలు డ్రా చేస్తూ ప్రభుత్వ నిధులను అక్రమంగా కాజేసిన ఘటనలో సుమారు రూ.1,40,18,308 మేర దుర్వినియోగం జరిగినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ విచారణలో తేలింది.
విచారణలో బయటపడిన వివరాల ప్రకారం, గతంలో పే-సెక్షన్లో పనిచేసిన ఓ పోలీసు ఉద్యోగి ఈ మోసానికి పాల్పడ్డాడు. మరణించిన ముగ్గురు కానిస్టేబుళ్ల ఎంప్లాయీ ఐడీలను ఉపయోగించి IFMIS పోర్టల్లో ఇతరుల పేర్లను చేర్చి జీతాలు విడుదలయ్యేలా చేశాడు. అనంతరం ప్రైవేట్ బ్యాంకుల్లో నకిలీ ఖాతాలు తెరిచి, తన వ్యక్తిగత మొబైల్ నంబర్లను అనుసంధానం చేసి 2022 నుంచి 2026 వరకు జీతాల సొమ్మును అక్రమంగా పొందినట్లు గుర్తించారు.
అక్రమంగా సంపాదించిన ఈ నిధులతో వ్యక్తిగత రుణాలు పొందడమే కాకుండా, ఇతర వ్యక్తిగత అవసరాలకు వినియోగించినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశాల మేరకు సంబంధిత పోలీసు ఉద్యోగిపై కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఇన్స్పెక్టర్ రాంచందర్ రావు తెలిపారు. ఈ కుంభకోణంలో మరెవరైనా ప్రమేయం ఉన్నారా అనే దానిపై అంతర్గత విచారణ కొనసాగుతోందని, పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు.








