contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సిగ్గులేని కేంద్రమంత్రి అంటూ కిషన్ రెడ్డిపై ఫైర్ అయిన కెటిఆర్

రాష్ట్ర మంత్రి కేటీఆర్ కేంద్రంపై ధ్వజమెత్తారు. హుజూర్ నగర్ సభలో ఆయన మాట్లాడుతూ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రానికి తెలంగాణ నుంచి రూ.3.68 లక్షల కోట్ల పన్నులు చెల్లించామని అన్నారు. తెలంగాణకు కేంద్రం రూ.1.68 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందని వెల్లడించారు. రూ.2 లక్షల కోట్లు ఇంకా తెలంగాణకే బాకీ ఉన్నారని తెలిపారు.

కానీ సిగ్గులేని కేంద్రమంత్రి, ఇక్కడుండే నలుగురు సన్నాసి ఎంపీలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుతున్నారో అవగాహన లేదు, కనీసం ఇంగితం లేదు… కేసీఆర్ గారిపై పనికిమాలిన వాగుడు వాగుతుంటారు అని విమర్శించారు. తెల్లారిలేస్తే పనికిమాలిన బూతులు మాట్లాడడం, మతం పేరుతో పనికిమాలిన రాజకీయం చేయడం తప్ప వాళ్లకు మరో పనిలేదని అన్నారు.

“ఇక్కడుండే బీజేపీ నేతలను, కేంద్రాన్ని అడుగుతున్నా… ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుతున్నారు? తెలంగాణ చెల్లించిన లక్షల కోట్ల రూపాయల పన్నులు బీజేపీ పాలిత వెనుకబడిన రాష్ట్రాల్లో వాడుతున్నది నిజం కాదా? నేను చెప్పింది తప్పయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తా… నేను చెప్పింది తప్పు అని నిరూపించలేకపోతే కిషన్ రెడ్డి రాజీనామా చేయడం అటుంచి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పగలరా? ఆ సంస్కారం ఉందా?” అని కేటీఆర్ సవాల్ విసిరారు.

తన సవాల్ తో కిషన్ రెడ్డి పదవికి రాజీనామా చేస్తాడని తాను అనుకోవడంలేదని, ఆ పని ఆయనకు చేతకాదని అన్నారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేని అసమర్థుడివి, దద్దమ్మవి నువ్వు అంటూ కిషన్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజమెత్తారు.

“కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వచ్చిన నాడు మన తలసరి ఆదాయం రూ.1,24,000… కానీ ఇవాళ తెలంగాణ తలసరి ఆదాయం రూ.2,78,000… ఇది నేను చెబుతున్న లెక్క కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెబుతున్న లెక్క. అదే సమయంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ తలసరి ఆదాయం రూ.1,49,000 మాత్రమే. అంటే.. మనలో సగం! దీన్ని బట్టి ఎవరు సమర్థుడో, ఎవరు అసమర్థుడో అర్థమవుతోంది.

ఇంకో బీజేపీ సన్నాసి మాట్లాడుతున్నాడు… కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాల్జేశాడట. మోదీ కంటే ముందు ఉన్న 14 మంది ప్రధానులందరూ కలిసి రూ.56 లక్షల కోట్ల అప్పులు చేస్తే, నరేంద్ర మోదీ ఒక్కడే ఈ ఎనిమిదేళ్లలో రూ.100 లక్షల కోట్ల అప్పులు చేశాడు. దేశంలో పుట్టే ప్రతి పిల్లవాడి తలపై రూ.1,25,000 రుణభారం మోపుతున్నాడు.

కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం భారతదేశానికి దిక్సూచిలా ఉండే పథకాలను అమలు చేసింది. మేం అప్పులు తెచ్చామంటే, ఆ అప్పులు ఎవరికోసం చేశాం? ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లా దామెరచర్లలో 5 వేల మెగావాట్ల సామర్థ్యంలో అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు కడుతోంది తెలంగాణ ప్రభుత్వం. మేం చేస్తున్నది అప్పు కాదు… అది భవిష్యత్తు మీద పెట్టుబడి. మిషన్ భగీరథలో ఇంటింటికీ నల్లా నీరు అందించడానికి రూ.40 వేల కోట్లు తీసుకువచ్చాం.

నల్గొండలో ఫ్లోరోసిస్ ను రూపుమాపింది మన కేసీఆర్ ప్రభుత్వం. ఆరోగ్యం మీద అది అప్పా? లేక పెట్టుబడా? అనేది ఆలోచించండి. రూ.2 వేల కోట్లతో ఎత్తిపోతల పనులు జరుగుతున్నాయంటే అది రైతన్నల కోసం పెట్టుబడి కాదా? దీన్ని కూడా అప్పు అంటారా? కాళేశ్వరం కోసం లక్ష కోట్లు వెచ్చించి సాగునీటి కోసం, తాగునీటి కోసం, విద్యుచ్ఛక్తి కోసం అప్పు తెచ్చి భవిష్యత్ మీద పెట్టుబడి పెట్టి సంపదను పునరుత్పత్తి చేస్తుంటే మీ కళ్లెందుకు మండుతున్నాయి?” అంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :