contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రేవంత్ రెడ్డీ .. వెంట్రుక కూడా పీకలేవ్: కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

“రేవంత్ రెడ్డీ, ఇక్కడ భయపడేవాళ్లు ఎవరూ లేరు… వెంట్రుక కూడా పీకలేవ్” అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సికింద్రాబాద్ లోక్ సభ పరిధి ముఖ్య నేతల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ… ఈ అయిదేళ్ల కాలంలో కిష‌న్ రెడ్డి ఏ ఒక్క అభివృద్ధి ప‌ని చేయ‌లేద‌ని… కిస్మ‌త్ బాగుండి కేంద్రమంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి కాలేరు వెంకటేశ్‌ను ప్రజలు గెలిపించారన్నారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచి.. కిస్మత్ బాగుండి కేంద్రమంత్రి అయ్యారన్నారు.

కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి చేసిన గొప్ప పనులు మూడంటే మూడు చేశారని విమర్శించారు. కరోనా వస్తే చాలామంది అన్నదానాలు చేశారని, అంబులెన్స్ లు ఇచ్చారనీ, కిషన్ రెడ్డి మాత్రం కుర్‌కురేలు పంచారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తే, కిషన్ రెడ్డి సీతాఫల్‌మండి రైల్వే స్టేషన్‌లో రెండు లిఫ్ట్‌లు ప్రారంభించారని, నాంపల్లిలో సింటెక్స్ ట్యాంకులు ప్రారంభించారని ఎద్దేవా చేశారు. మూసీకి వరద వస్తే కిషన్ రెడ్డి రూపాయి తేలేదని విమర్శించారు.

కనీసం అంబర్‌పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి పూర్తి కాలేదన్నారు. రేవంత్ రెడ్డి ఇటీవల బైరామల్‌గూడలో ప్రారంభించిన ఫ్లైఓవర్ మనం కట్టించిందే అని చెప్పారు. కిషన్ రెడ్డికి ఓటేయాలని ఎవరైనా చెబితే అంబర్‌పేట ఫ్లైఓవర్ చూసి రమ్మనాలని సూచించారు. కిషన్ రెడ్డి ఇష్టంవచ్చినట్లు నోరు పారేసుకోవద్దని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఏవైనా ఆధారాలు ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ పదేళ్లు దేశానికి మోదీ ఏం చేశారని చెప్పడానికి కిషన్ రెడ్డి వద్ద ఏమీ లేదన్నారు.

బీజేపీలోకి జంప్ అవడం ఖాయం..

రేవంత్ రెడ్డీ, ఇక్కడ భయపడేవాళ్లు ఎవరూ లేరు.. వెంట్రుక కూడా పీకలేవని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి తన ముఠాతో బీజేపీలోకి జంప్ అవడం ఖాయమని… ఇది రాసిపెట్టుకోవచ్చునని చెప్పారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి 40 లోక్ సభ స్థానాలు దాటే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. తాను మాట్లాడే ప్రతి మాటకు రేవంత్ రెడ్డి స్పందిస్తుంటాడని… కానీ బీజేపీలోకి వెళతావనే తన ఆరోపణకు మాత్రం స్పందించడం లేదన్నారు. ఆడపిల్లల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదని విమర్శించారు. రైతుబంధు ఇవ్వడం లేదన్నారు.

ఫోన్ ట్యాపింగ్ అంటూ లీక్‌లు ఇస్తున్నాడు… ఏదైనా జరిగితే విచారణ చెయ్… తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకో… ఇక్కడ భయపడేవాళ్లు ఎవరూ లేరని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికలకు డబ్బుల కోసం రైస్ మిల్లర్లను, బిల్డర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. అందరినీ బెదిరిస్తూ ఢిల్లీకి రూ.2,500 కోట్లు జమ చేసిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :