ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీకి శనివారం శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, ఇది కేవలం ఒక భవనానికి పునాది రాయి వేయడం కాదని, క్వాంటం టెక్నాలజీ రంగంలో భారతదేశ భవిష్యత్ నాయకత్వానికి ఇక్కడే పునాది వేస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికత వల్లే ఈ కీలక అడుగు సాధ్యమైందని ఆయన కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, స్టార్టప్ ప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
చరిత్ర పునరావృతం అవుతోంది
మంత్రి లోకేశ్ తన ప్రసంగంలో గత ఐటీ విప్లవాన్ని గుర్తు చేస్తూ, “కొన్నేళ్ల క్రితం ప్రపంచం సాఫ్ట్వేర్ సేవలపై ఆలోచించడం ప్రారంభించిన సమయంలో, ‘హైదరాబాద్ను ప్రపంచ ఐటీ రాజధానిగా ఎందుకు మార్చకూడదు?’ అనే ఒక ధైర్యమైన ప్రశ్న చరిత్రను మార్చింది. మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు భారత్కు వచ్చాయి, లక్షల ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. ఒక నగరమే కాదు, ప్రపంచంలో భారతదేశ స్థాయి కూడా మారింది. ఆ దార్శనిక నాయకుడే మన ముఖ్యమంత్రి చంద్రబాబు” అని అన్నారు.
ఈరోజు మరింత లోతైన సాంకేతికతలు, పెద్ద సవాళ్లు, గొప్ప అవకాశాలతో కూడిన కొత్త శకంలోకి అడుగుపెడుతున్నామని పేర్కొన్న ఆయన, “భారత్ క్వాంటం విప్లవాన్ని అనుసరించడమే కాదు, ఎందుకు నాయకత్వం వహించకూడదు?” అనే ముఖ్యమంత్రి ప్రశ్నకు సమాధానమే అమరావతి క్వాంటం వ్యాలీ అని స్పష్టం చేశారు.
సీఎం ముందుచూపు అమోఘం
ముఖ్యమంత్రి ముందుచూపును ప్రశంసిస్తూ లోకేశ్ ఒక ఆసక్తికర ఘటనను ప్రస్తావించారు. ప్రొఫెసర్ కామకోటి గారితో సమావేశం అనంతరం క్వాంటం ఎకోసిస్టమ్ను నిర్మించాలని సీఎం సూచించారని తెలిపారు. ఆ సమయంలో తాను చాట్జీపీటీ ద్వారా క్వాంటం కంప్యూటింగ్పై సమాచారం తెలుసుకున్నానని, కానీ క్వాంటం టెక్నాలజీ భవిష్యత్తుపై ముఖ్యమంత్రి అప్పటికే లోతైన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని అన్నారు. ఇతరులు ఇంకా క్వాంటం అంటే ఏమిటో చర్చిస్తున్న దశలోనే, ఈ రంగంలో భారత్ ఎలా నాయకత్వం వహించాలనే దానిపై సీఎం ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు.
‘బుల్లెట్ ట్రైన్ సర్కార్’ మాది
ఆంధ్రప్రదేశ్కు ఉన్న ప్రధాన బలాలను వివరిస్తూ, ఒకటి నిరూపితమైన ట్రాక్ రికార్డ్ కలిగిన చంద్రబాబు గారి నాయకత్వమని, రెండవది పనులను పూర్తి చేయడంలో తమ ప్రభుత్వానికి ఉన్న అసమాన వేగమని లోకేశ్ తెలిపారు. “ఇతర రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది” అని వ్యాఖ్యానించారు.
దీనికి ఉదాహరణలుగా, దేశంలోనే అతిపెద్ద ఎఫ్డీఐ అయిన 15 బిలియన్ డాలర్ల గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టును 13 నెలల్లో పూర్తి చేసిన విషయాన్ని, అలాగే ఇతర రాష్ట్రాల్లో దశాబ్దకాలంగా నిలిచిపోయిన ఆర్సెల్ మిట్టల్ ప్రాజెక్టును కేవలం ఏడాదిలోనే ఏపీలో పూర్తి చేసిన ఘనతను గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఒకసారి కమిట్ అయితే, దార్శనికతకు వేగం తోడవుతుందని లోకేశ్ స్పష్టం చేశారు.
రాష్ట్రానికి వచ్చే ప్రతి ప్రాజెక్టును తమ ఉమ్మడి ప్రాజెక్టుగా భావించి, అడ్డంకులు తొలగించి, అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.








