మెదక్ : మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు నియమితులైన కౌంటింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ తెలిపారు.
కౌంటింగ్ విధులకు నియమించబడిన సిబ్బందిని వారి సంబంధిత శాఖాధికారులు రెండు రోజులపాటు విధుల నుంచి విడుదల చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు. కౌంటింగ్ శిక్షణ తరగతులు 12.02.2026 తేదీన ఉదయం 10:30 గంటలకు సంబంధిత కౌంటింగ్ కేంద్రాల్లో నిర్వహించబడతాయని తెలిపారు.
మెదక్లో వెస్లీ జూనియర్ కళాశాల, రామాయంపేటలో ఎంపీడీవో కార్యాలయం, నర్సాపూర్లో బివిఆర్ఐటి కళాశాల, అలాగే నోబెల్ ఫార్మసీ కళాశాలలో శిక్షణ కార్యక్రమాలు జరుగనున్నట్లు పేర్కొన్నారు. నియమితులైన సిబ్బంది అందరూ సమయానికి హాజరై శిక్షణలో పాల్గొని కౌంటింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన పొందాలని సూచించారు.
అలాగే కౌంటింగ్ విధులు 13.02.2026 తేదీన ఉదయం 7:00 గంటలకు అదే ప్రాంగణాల్లో ప్రారంభమవుతాయని, అందరూ తప్పనిసరిగా హాజరై తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి ఆదేశించారు.
ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకతతో, నియమావళి ప్రకారం విజయవంతంగా పూర్తవ్వాలంటే ప్రతి సిబ్బంది సహకారం అత్యంత కీలకమని రాహుల్ రాజ్ పేర్కొన్నారు.








