మాసాయిపేట తూప్రాన్ డివిజన్: మాసాయిపేట మండలం శివారులోని ఎన్హెచ్-44 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాంగ్ రూట్లో వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనం ఎదురుగా వస్తున్న టెంపోను ఢీకొనడంతో వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందిన విషాద సంఘటన ప్రాంతంలో కలకలం రేపింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ద్విచక్ర వాహనదారుడు రాంగ్ సైడ్లో ప్రయాణిస్తూ ఎదురుగా వస్తున్న టెంపోను ఢీకొన్నాడు. ఢీకొన్న ప్రభావం తీవ్రంగా ఉండటంతో అతడు ఘోర గాయాలకు గురై ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ ప్రమాదం మాసాయిపేట మండలం సమీపంలోని ఎన్హెచ్-44పై చోటుచేసుకోవడంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. తూప్రాన్ నుండి మెదక్ వైపు ప్రయాణిస్తున్న జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ ప్రమాదాన్ని గమనించి వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
అదనపు ఎస్పీ స్వయంగా పరిస్థితిని సమీక్షించి, మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించేలా పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. అనంతరం ట్రాఫిక్ను సక్రమంగా క్లియర్ చేసి వాహన రాకపోకలను పునరుద్ధరించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాంగ్ రూట్లో వాహనాలు నడపడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.








