మెదక్ జిల్లా- తూప్రాన్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సోమవారం రైతులకు ప్రత్యేక ఆన్లైన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారి గంగమల్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పలు ఆధునిక వ్యవసాయ సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించారు.
ATMA (ఆత్మ) వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ సౌజన్యంతో నర్సాపూర్ డివిజన్ పరిధిలోని తూప్రాన్ మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయ ఆవరణలో ఈ శిక్షణ నిర్వహించారు. రైతులు మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని, నూతన సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించే విధానంపై అధికారులు సవివరంగా వివరించారు.
భూభారతి వ్యవస్థను తొలగించి, సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన కొత్త యాప్ను వ్యవసాయ శాఖ పరిచయం చేసింది. ఈ యాప్ ద్వారా ప్రతి సర్వే నంబర్కు సంబంధించిన లొకేషన్ను భూ సర్వే అవసరం లేకుండానే సులభంగా గుర్తించవచ్చని తెలిపారు. భూ సంబంధిత సమస్యలను సాంకేతికంగా పరిష్కరించేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని అధికారులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి గంగమల్లు, అసిస్టెంట్ వ్యవసాయ శాఖ అధికారి సంతోష్, వ్యవసాయ శాఖ వాలంటీర్లు మరియు పలువురు రైతులు పాల్గొన్నారు. రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని దిగుబడులు పెంచుకోవాలని అధికారులు సూచించారు.








