మెదక్, తూప్రాన్ డివిజన్ : జిల్లాలో ఎవరైనా క్రికెట్ లేదా ఇతర బెట్టింగ్లకు పాల్పడినా, వాటిని ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు హెచ్చరించారు.
ఇటీవల కాలంలో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో యువత క్రికెట్ బెట్టింగ్ మోజులో పడి తమ భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నారని ఆయన తెలిపారు. ఈ అలవాటు వల్ల ఆర్థిక నష్టాలు ఎదుర్కొనేందుకు తోడు, కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు ముప్పు తెచ్చుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యంగా వారి మొబైల్ ఫోన్ వినియోగం, ప్రవర్తనలో మార్పులను గమనించాలని, అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వెంటనే స్పందించాలని తెలిపారు.
జిల్లాలో బెట్టింగ్ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని ఎస్పీ తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పాటు టాస్క్ ఫోర్స్, ప్రత్యేక బృందాల సహకారంతో నిఘాను మరింత కట్టుదిట్టం చేస్తున్నామని చెప్పారు.
జిల్లాలో ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడినా లేదా ప్రోత్సహించినా కఠినంగా వ్యవహరిస్తామని మరోసారి హెచ్చరించారు. బెట్టింగ్లపై సమాచారం ఉన్నవారు వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100, అలాగే జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712657888 కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు.







