జగిత్యాల జిల్లా, మెట్పల్లి: ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సహకరించాలని మెట్పల్లి డీఎస్పీ రాములు పిలుపునిచ్చారు. మెట్పల్లి డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు.
ఎన్నికల ప్రచార గడువు ముగిసిన నేపథ్యంలో ఈ నెల 11న జరగనున్న ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో ఓట్ల కోసం ప్రచారం చేయడం, గొడవలకు దారి తీసే పరిస్థితులను సృష్టించడం తగదని హెచ్చరించారు.
ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించినా వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రాములు స్పష్టం చేశారు. ఎన్నికల నేపథ్యంలో పాత నేరస్తులకు కౌన్సిలింగ్ నిర్వహించామని, వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని తెలిపారు.
కోరుట్ల, మెట్పల్లి పట్టణాలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నాయని, పోలింగ్ కేంద్రాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రతి కదలికను నిశితంగా గమనిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో డీఎస్పీ వెంట సీఐ అనిల్ కుమార్, మెట్పల్లి ఎస్సై కిరణ్, కోరుట్ల ఎస్సై చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.







