- అపరిశుభ్రముగా ఉన్న సింగరుట్ల నృసింహ స్వామి పుణ్య తీర్థం (దొన )
- పట్టించుకోని ఎండోమెంట్ అధికారులు
పల్నాడు జిల్లా : పల్నాడుజిల్లా కారెంపూడి మండలంలోని పేట సన్నెగండ్ల గ్రామ శివారులో స్వయం భూ గా వెలసిన నరసింహా స్వామి దేవస్థానం ఉంది. ఈ దేవస్థానం ఆవరణలో ప్రకృతి సిద్ధంగా దొన ఏర్పడింది. ఈ దొన లో 365 రోజులు స్వచ్ఛమైన నీరు ఉంటుంది. ఈ నీరు కొండలోనుంచి ఎక్కడి నుండి ఇంత స్వచ్ఛమైన నీరు వస్తుందో తెలియదు. ఇదంతా ఆ స్వామి లీలలుగా భక్తులు భావిస్తుంటారు. ఈ నీటిని పుణ్య తీర్థంగా భావించి గుడికి వచ్చిన భక్తులు సేవించి సేద తీరుతుంటారు. పుణ్య తీర్థంగా భావించే నీటి దొన అపరిశుభ్రంగా కనిపించేసరికి భక్తులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ దేవాలయానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి స్వామి వారిని సేవించి పూజిస్తారు. ఈ స్వామి లీలలు తెలుసుకున్న కాకతీయ రాజు స్వామి వారిని సేవించి సుమారు 1407 ఎకరాలు భూమిని అగ్రహారంగా స్వామి వారికి ఇచ్చారు. ఇంత భూమి ఉంది కాబట్టి దేవాలయాన్ని ఎండోమెంట్ లో కలుపుకుంది. ఈ ఆలయం భూమి లో సిమెంట్ ఫ్యాక్టరీ కూడా ఉంది. ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం దేవస్థానానికి ప్రతి ఏడాది నగదు రూపంలో కప్పం చెలిస్తారు. ఇంత ఆదాయం ఉన్న దేవస్థానం యొక్క పుణ్యతీర్థం శుభ్రం చేయించేందుకు ఎండోమెంట్ అధికారులకు సమయం, బాగు చేయించాలనే ఆలోచన రాకపోవడం ఏమిటోనని భక్తులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ దేవాలయ ఆదాయంతో జీతభత్యాలు తీసుకొని ఉద్యోగం నిర్వర్తించే వారు ఆలయ ని పరిశుభ్రంగా ఉంచకపోవడం దారుణమని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానానికి చెందిన ఆవరణలో ఏదైనా నిర్లక్ష్యం వహిస్తే సహించమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే పుణ్య తీర్దాన్ని శుభ్రం చేయించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.